హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ వెల్లడించారు. త్వరలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా అబ్జర్వర్లను నియమిస్తామని, తర్వాత సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. శనివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ జ్యోత్స్నతో పాటు పలువురు నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు. గత వారంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు. ధర్నాచౌక్లో టీఆర్ఎస్ ఏడాది పాలన వైఫల్యాలపై టీడీపీ చేపట్టిన మహాధర్నాపై నేతలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 11 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించామని, మిగతా నియోజకవర్గాలకు వచ్చే శనివారం నియమిస్తామని తెలిపారు. టీడీపీ లేదంటున్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్నారు.
ౌ