హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వి చారణ సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేర ళకు చెందిన భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ హైకోర్టులో సోమవారం పిటిషన్ వేశారు. సిట్ దర్యాప్తు చేయడంపై స్టే విధించాలని కోరారు. పిటిషన్లో కేసీఆర్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని తుషార్ పేర్కొన్నారు. తనను 21న విచారణకు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. తాను అనారోగ్యం కారణంగా 2 వారాల గడువు ఇవ్వాలని మెయిల్ ద్వారా కోరానని, అందుకు సమాధానం ఇవ్వకుండానే లుక్ఔట్ నోటీసు జారీ చేశారని చెప్పారు.
అంతా కేసీఆర్ ప్లాన్ ప్రకారమే..
ఫామ్ హౌస్ సీసీ కెమెరాల్లోని ఫుటేజీ, ఆడియో రికార్డులను రాజేంద్రనగర్ ఏసీపీ.. కేసీఆర్కు ఇచ్చారని, ఆ వీడియోలను సీజేఐకి, అన్ని హైకోర్టుల సీజేలకు కేసీఆర్ ప్లాన్ ప్రకారమే పంపారని తుషార్ ఆరోపించారు. నిందితుడు కాని తనకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేయడం అన్యాయమన్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించిందని పేర్కొన్నారు. తొలుత ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, ఈ నెల 23న కింది కోర్టు మెమో ద్వారా నిందితుడిగా చేర్చినట్లుగా సిట్ పేర్కొందన్నారు. ప్రభుత్వమే సిట్ను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. డబ్బులు దొరకనప్పుడు నేరం జరిగిందని అభియోగం మోపడం చెల్లదన్నారు. రాజకీయ కుట్రతో సిట్ దర్యాప్తు జరుగుతోందని, రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న సిట్ దర్యాప్తుపై స్టే విధించాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.