సెక్రటేరియెట్ దగ్గర్లో ట్విన్ టవర్లు!..వివిధ శాఖల హెచ్ఓడీల కోసం

సెక్రటేరియెట్ దగ్గర్లో ట్విన్ టవర్లు!..వివిధ శాఖల హెచ్ఓడీల కోసం

హైదరాబాద్, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల డైరెక్టరేట్ కార్యాలయాలు, కమిషనర్ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కొత్త సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లో ట్విన్ టవర్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో విశాలమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్ఓడీల ఆఫీసులన్నీ ఒకే చోట ఉండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. 

సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో సీఎం కేసీఆర్​ఉన్నత స్థాయి రివ్యూ చేశారు. కొత్త సెక్రటేరియెట్​ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం.. డైరెక్టరేట్లు, కమిషనరేట్ల అధికారులకు సెక్రటేరియెట్‌‌‌‌లో తరచుగా పని ఉంటున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ విభాగాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాలను ఒకే చోటుకు చేర్చడం గురించి సీఎం కేసీఆర్​ చర్చించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని విభాగాధిపతులు, వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తిస్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశం గర్వించేలా నిర్మించుకున్న కొత్త సచివాలయంలో ఉద్యోగులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణకు అనువుగా ఉందని సీఎం చెప్పారు. అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్కే భవన్, ఇంకో రెండు స్థలాలను ట్విన్ టవర్ల నిర్మాణం కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

కుల వృత్తులు, సంచార జాతులకు సాయం

రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు, కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్  తెలిపారు. వీరికి రూ.లక్ష చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని  కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సబ్ కమిటీ చైర్మన్, బీసీ మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. రివ్యూ తర్వాత అమరుల స్మారకం దగ్గరకు వెళ్లి.. అక్కడ జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. తర్వాత బీఆర్కే భవన్ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని కేసీఆర్ పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని ఆదేశించారు. జూన్ రెండు నుంచి ప్రతి రోజూ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను సీఎస్ శాంతికుమారి వివరించారు.