బాలిక మృతి కేసులో ట్విస్ట్​

బాలిక మృతి కేసులో ట్విస్ట్​

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి దళిత బాలిక మృతి కేసులో ప్రధాన నిందితుడు సుందిళ్ల బ్యారేజ్​లో శవమై తేలాడు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించి, హత్య చేశాడని బాలిక పేరెంట్స్​సహా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా.. నిందితుడు శవంగా మారడం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగాంబాల బస్తీకి చెందిన బాలిక(17) అమ్మమ్మ వద్ద ఉంటోంది. బెల్లంపల్లిలోనే రామ్​నగర్​కు చెందిన సాజిద్(20)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాలిక పేరెంట్స్​ హైదరాబాద్​లో ఉండగా.. ఆమె వాళ్ల వద్ద ఉంటూ.. మొన్నటి దాకా ఓ కాల్​సెంటర్​లో పని చేసేది. ఈ నెల12న ఉదయం జాబ్​కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన బాలిక.. అదే రోజు సాయంత్రం సాజిద్​ను పెళ్లి చేసుకున్నట్లు, అతనితోపాటే ఉంటానని పేరెంట్స్​కు ఫోన్​ చేసి చెప్పింది. తర్వాత ఆమె ఫోన్​ స్విచాఫ్​ వచ్చింది. దీంతో పేరెంట్స్​ మల్కాజ్​గిరి పీఎస్​లో మిస్సింగ్​ కేసు పెడుతూ.. సాజిద్​పై అనుమానమున్నట్లు చెప్పారు. పోలీసులు వారి కోసం గాలిస్తుండగా.. ఈ నెల16న జైపూర్ మండలం బెజ్జాల దగ్గర గోదావరి  ఒడ్డున బాలిక శవం దొరికింది. సాజిద్ ​ప్రేమ పేరుతో వేధించి బాలికను రేప్​ చేసి చంపాడని, అతడే శవాన్ని గోదావరి లో పడేశాడని ఆమె పేరెంట్స్​సహా దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుండగానే.. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజ్ లో సాజిద్​ మృతదేహం కనిపించింది. బాలికను చంపి సాజిద్​ కూడా అదేరోజు చనిపోయాడా, పట్టుకుంటారన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు బాలిక, సాజిద్​ల  ఫోన్ కాల్​ రికార్డ్స్​ పరిశీలిస్తున్నారు.