- ముందుగా మోడీపై కేటీఆర్ కామెంట్లు
- కౌంటర్ ట్వీట్లతో కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో ట్వీట్లు చేసుకున్నారు. ముచ్చింతల్లో రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయడంపై ఆదివారం కేటీఆర్ ముందుగా ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని వివక్షకు చిహ్నమైన వ్యక్తి ఆవిష్కరించారు. సమానత్వాన్ని దూరం చేసినవాళ్లు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం చూస్తే.. తలపెట్టిన కార్యక్రమం అసలు ఉద్దేశం పక్కదారి పట్టినట్లుగా తేలిపోయింది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘సమానత్వ భావాలను చాటి చెప్పేందుకు ఉద్దేశించిన ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయం చేయడం దురదృష్టకరం. రామానుజాచార్యులపై విమర్శలు మానుకోవాలి. రాజకీయ విమర్శలకు ప్రధాని మోడీ అలవాటు పడ్డారు’’ అని కౌంటర్ ఇచ్చారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటున్న మోడీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేను నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను ఖతం చేస్తామని గతంలో ఎంఐఎం నేత ఒవైసీ చేసిన వ్యాఖ్యలను సోమవారం ట్వీట్ లో ప్రస్తావించారు. రజాకార్లతో ఊచకోతలకు పాల్పడిన నిజాం వారసులకు కేటీఆర్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
రాంచందర్ రావు కూడా రంగంలోకి..
అనవసర విషయాలు తెరపైకి తేవద్దని కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదాపై మాట్లాడాలని కోరారు. ‘‘కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వకున్నా.. ప్రముఖ ఐటీ కంపెనీలను తెచ్చుకున్నం. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకున్నా ప్రాజెక్టు కట్టుకున్నం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నం. రాష్ట్రానికి మేం అండగా ఉంటే.. మీరు దేశానికే దండగ” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ నేత రాంచందర్ రావు.. కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ‘‘కేటీఆర్.. మీరు రియాలిటీకి దగ్గరగా లేరు. మీ దురదృష్టం ఏంటంటే.. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీతో భాగ్యనగరం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మీ వాళ్ల చార్మినార్తో కాదు’’ అని ట్వీట్ చేశారు.