హాష్ ఆయిల్ అమ్ముతున్నవ్యక్తి అరెస్ట్
జీడిమెట్ల: హాష్ ఆయిల్ అమ్ముతున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 లక్షల విలువైన 220 హాష్ ఆయిల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చింతల్లోని పాపయ్యయాదయ్యనగర్ ను చెందిన కమలాకర్, మనోజ్ ఇద్దరు కలిసి గంజాయిని హాష్ ఆయిల్ రూపంలో అమ్ముతున్నారు. బుధవారం ఆ ఏరియాలో తనిఖీలు చేపట్టిన కుత్బుల్లాపూర్ ఎక్సైజ్, మేడ్చల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు బైక్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న కమలాకర్, మనోజ్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ అక్కడి నుంచి పారిపోగా..కమలాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 5 హాష్ ఆయిల్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కమలాకర్ ఇంటిలో తనిఖీ చేసిన పోలీసులకు మరో 215 బాటిల్స్ దొరికాయి. సత్తిబాబు అనే వ్యక్తి నుంచి హాష్ ఆయిల్ను తీసుకుని సిటీలో అమ్ముతున్నట్లు విచారణలో కమలాకర్ పోలీసులకు తెలిపాడు. ఎల్లమ్మబండలోనూ తనిఖీలు చేపట్టిన పోలీసులు సిక్కుబస్తీకి చెందిన జగత్సింగ్ నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లైట్మన్లుగా పనిచేస్తూ గంజాయి దందా
యూసుఫ్ గూడ అడ్డాగా గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని అనకాపల్లికి చెందిన మదన్(30), యుగేందర్(23) ఆరు నెలల క్రితం సిటీకి వచ్చారు. యూసుఫ్ గూడలోని యాదగిరినగర్లో ఉంటోన్న వీరిద్దరు సినిమా షూటింగ్స్ కి లైట్ మన్లుగా పనిచేస్తున్నారు. ఈజీమనీ కోసం గంజాయి సప్లయ్ కు స్కెచ్ వేశారు. వైజాగ్లోని పాడేరు ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకొచ్చి సిటీలోని పలు ప్రాంతాల్లో సప్లయ్ చేయడం మొదలుపెట్టారు. దీని గురించి సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం యూసుఫ్ గూడలో మదన్, యుగేందర్ను అరెస్ట్ చేశారు. రూ.2.6 లక్షల విలువైన 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
170 హాష్ ఆయిల్ బాటిల్స్ స్వాధీనం
ఎస్ఆర్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో పోలీసులు బుధవారం దాడులు చేసి రౌడీ షీటర్తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ. 3 లక్షల విలువైన 170 హాష్ ఆయిల్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. 650 గంజాయి చాక్లెట్ల పట్టివేత గంజాయి చాక్లెట్లను సప్లయ్ చేస్తున్న వ్యాపారిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. బోరబండకు చెందిన దుర్గాప్రసాద్(42) మాదాపూర్లోని ఖానామెట్లో కిరాణా షాప్ నడుపుతున్నాడు. బేగంబజార్ హోల్సేల్ మార్కెట్ నుంచి షాపులో అమ్మేందుకు అవసరమైన సరుకులను కొనేవాడు. ఈ క్రమంలో గంజాయి బంగ్ కలిపిన చాక్లెట్లను తన షాపులో అమ్మేందుకు దుర్గాప్రసాద్ స్కెచ్ వేశాడు. మంగళవారం 650 చాక్లెట్లను ఇంటిని తీసుకొచ్చాడు. దీని గురించి సమాచారం అందుకున్న శేరిలింగపల్లి ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ టీమ్ బుధవారం దుర్గా ప్రసాద్ ఇంటిపై దాడులు చేసింది. గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించింది. రాజస్థాన్లో ఈ చాక్లెట్లు అమ్మేందుకు అనుమతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.