- కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్లో ఘటన
- మృతులది వీణవంక మండలం మామిడాలపల్లి
కరీంనగర్ క్రైం, వెలుగు: స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఇద్దరు డిగ్రీ స్టూడెంట్లు చనిపోయారు. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని బైపాస్ రోడ్డులో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మ్యాకల పద్మ, కొమురయ్య దంపతుల కొడుకు గణేశ్(22), అదే గ్రామానికి చెందిన మిరియాల శ్రీనివాస్ రెడ్డి కొడుకు సందీప్ రెడ్డి(20) స్నేహితులు.
వీరిద్దరు ఒక బైక్ పై, అదే గ్రామానికి చెందిన మిరియాల రంజిత్ రెడ్డి మరో బైక్ పై స్పేర్ పార్ట్స్ కోసం సోమవారం మధ్యాహ్నం కరీంనగర్ బయల్దేరారు. ఈక్రమంలో స్కూల్ బస్సు హౌసింగ్ బోర్డు వైపు రోడ్డు దాటుతూ ఒక్కసారిగా టర్నింగ్ తీసుకోవడంతో వెనక వస్తున్న గణేశ్, సందీప్ రెడ్డి బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరి తలలకు తీవ్రగాయాలవగా, వారితో పాటు మరో బైక్ పై వస్తున్న రంజిత్ రెడ్డి వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
డాక్టర్లు పరీక్షించి అప్పటికే చనిపోయారని తెలిపారు. ఇండికేటర్ వేయకుండా, ఎలాంటి సిగ్నల్ఇ వ్వకుండా బస్సు డ్రైవర్ గంధం భాస్కర్ సడెన్గా బస్సును టర్న్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గణేశ్ తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతో మామిడాలపల్లిలో విషాదం అలుముకుంది. ఒక్కగానొక్క కొడుకు సందీప్ రెడ్డి చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
