- కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు..
- ఏకగ్రీవం అయ్యాక కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు కౌన్సిలర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన మంగళవారం రాజకీయ పరిణామాల మధ్య ఈ ఫలితం వెలువడింది. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పట్లోళ్ల అనంత్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ముర్తూజా అలీ నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో బీఆర్ఎస్ బీ–ఫామ్ అందకముందే ముర్తూజా అలీ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి అనంత్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 15వ వార్డులో బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె భర్త విజయ్కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రెండు వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవ ఫలితం దక్కినట్లైంది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అభినందించారు.
