
- ఐదేండ్ల శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా
- తీర్పు వెల్లడించిన ఢిల్లీ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు
హైదరాబాద్, వెలుగు: దేశంలో టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ఐఎస్ టెర్రరిస్టులకు ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట హఫీజ్ బాబానగర్కు చెంది న మహ్మద్ అబ్దుల్లా బాసిత్(28), అబ్దుల్ ఖదీర్(23)కు ఒక్కొక్కరికి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కేసు వివరాలు, కోర్టు తీర్పును ఎన్ఐఏ శుక్రవారం వెల్లడించింది.
దేశంలో ఐఈడీతో విధ్వంసాలు సృష్టించేందుకు, యువతను టెర్రరిజం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) కుట్ర చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. హోంశాఖ ఆదేశాలతో 2016, జనవరి 1న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఐఎస్ సభ్యులైన జమ్మూ కాశ్మీర్కు చెందిన షేక్ అజర్ అల్ ఇస్లాం సత్తార్, కర్నాటకకు చెందిన అద్నాన్ హుస్సేన్, మహారాష్ట్ర థాణేకు చెందిన మహ్మద్ ఫర్హాన్ షేక్లను అదే ఏడాది జనవరి 29న అరెస్ట్ చేసింది. పాకిస్తాన్కు చెందిన ఖలీద్ ఖిల్జీ ఆదేశాలతో ముస్లిం యువత రిక్రూట్మెంట్కు పాల్పడుతున్నట్లు గుర్తించింది.
హఫీజ్బాబానగర్లో షెల్టర్
ఎన్ఐఏ దర్యాప్తులో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట కేంద్రంగా అబ్దుల్లా బాసిత్, ఖదీర్లు ఐఎస్కు పనిచేస్తున్నట్టు వెల్లడైంది. హఫీజ్ బాబానగర్లో నివాసం ఉంటున్న బాసిత్ ఐఎస్ సానుభూతిపరులను సిరియాకు తరలిస్తున్నట్లు గుర్తించింది. అబుదాబి మాడ్యూల్కు చెందిన అజీఫాతో ఐఎస్లో చేరిన బాసిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, ఇందులో భాగంగానే ఖదీర్ను టెర్రరిజం వైపు మళ్లించాడని ఆధారాలు సేకరించింది. 2018, ఆగస్టు 12న హైదరాబాద్లో సోదాలు చేసి ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద ఐఈడీతో పాటు పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకుంది. 2019, ఫిబ్రవరి 7న వారిపై చార్జిషీట్ దాఖలు చేయగా.. ఢిల్లీ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసింది.