మాజీ ప్రధాని భార్యను తగలబెట్టి చంపేసిన ఆందోళనకారులు : అసలు ఏం జరుగుతుందయ్యా అక్కడ..!

మాజీ ప్రధాని భార్యను తగలబెట్టి చంపేసిన ఆందోళనకారులు : అసలు ఏం జరుగుతుందయ్యా అక్కడ..!

నేపాల్ దేశం తగలబడుతోంది.. కుర్రోళ్లు హద్దులు దాటి రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు కనిపిస్తే చాలు పరిగెత్తించి కొట్టటమే కాదు.. ఏకంగా చంపేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా నేపాల్ మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ భార్య రబీ లక్ష్మీని తగలబెట్టి మరీ చంపినట్లు వార్తలు వస్తున్నాయి. 

2025, సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం సమయంలో.. ఖాట్మాండు సిటీ శివార్లలో దుల్లు అనే ప్రాంతంలో మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆందోళనకారులు ఆ ఇంటిని ముట్టడించారు. ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మాజీ ప్రధాని భార్య రబీ లక్ష్మీని ఇంట్లోని బంధించి నిప్పు పెట్టారు. మంటలు ఎత్తుఎత్తున వ్యాపించి.. ఆమె తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే సైన్యం స్పాట్ కు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే కాలిన గాయాలతో చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇప్పుడు ఆమె మృతదేహం కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రిలో ఉన్నట్లు వెల్లడించారు భద్రతా అధికారులు.

సోషల్ మీడియాపై నిషేధం ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా నేపాల్ దేశంలో నిరసనలు ఆగలేదు. రెండో రోజు మరింత పెరిగాయి. ప్రధాన మంత్రి, మంత్రుల ఇళ్లను టార్గెట్ చేసిన నిరసనకారులు.. కనిపించిన వాళ్లను కనిపించినట్లు కొట్టారు. ఆందోళన ఉధృతంగా ఉండటంతో ప్రధానమంత్రి ఓలీ రాజీనామా చేశారు. 

మాజీ ప్రధానమంత్రుల ఇళ్లను కూడా తగలబెట్టారు. నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా డ్యూబాపైనా దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి.