కరీంనగర్ లో ఇద్దరు దొంగల అరెస్ట్ .. 20 తులాల గోల్డ్ స్వాధీనం

కరీంనగర్ లో ఇద్దరు దొంగల అరెస్ట్ .. 20 తులాల గోల్డ్ స్వాధీనం
  • పరారీలో మరో ముగ్గురు నిందితులు
  • కరీంనగర్ సీపీ గౌస్ ఆలం వెల్లడి

కరీంనగర్ క్రైం, వెలుగు:ఇద్దరు దొంగలను అరెస్టు చేసి సొత్తును కరీంనగర్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం కమిషనరేట్ లో మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం కేసు వివరాలు తెలిపారు.  గంగాధర మండలం  వెంకటయ్యపల్లికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఈనెల 8న మంచినీటిని తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చే  సరికి  గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపు పగలగొట్టి రెండు బీరువాల్లోని 33 తులాల బంగారు ఆభరణాలు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు.  బాధితుడి ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

గంగాధర క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ కు చెందిన గాజుల హేమంత్(19), కొమ్ము నవీన్ కుమార్ ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు.  బంగారం అమ్మేందుకు జగిత్యాలకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇద్దరు దొంగల వద్ద 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను తక్కువ ధరకు కొన్న ముగ్గురుపై కేసు నమోదు చేశామని, వీరు పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, సీఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు.