ఫేక్​పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ఫేక్​పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో మరో ఇద్దరు అరెస్ట్
  • పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం
  • నిందితుల కోసం లుకౌట్ నోటీస్ జారీ

హైదరాబాద్​: ఫేక్​పాస్‌పోర్టుల కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను సీఐడీ అరెస్ట్​చేసింది. ఏపీలోని అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫేక్​పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 12 మందిని  అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. మొత్తం 92 నకిలీ పాస్‌పోర్టులను జారీ అయినట్లు గుర్తించారు. నిందితుల సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులను రద్దు చేశారు. 

నకిలీ పాస్‌పోర్టు కేసులో సీఐడీ అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఫేక్ పాస్‌పోర్టుతో 92 మంది దేశం విడిచి వెళ్లినట్టు గుర్తించి వారి వివరాలను విదేశాంగ శాఖకు పంపించారు. వారిని వెనక్కి రప్పించి విచారించాలని సీఐడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే  92 మంది పాస్‌పోర్టులను రద్దు చేయాలని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్‌కు సీఐడీ లేఖ రాసింది. ఈ స్కాంలో ఏజెంట్లు, పాస్‌పోర్టు సిబ్బంది, ఎస్‌బీ సిబ్బంది కుమ్మక్కైనట్టు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. జగిత్యాలతో పాటు ఫలక్‌నుమా చిరునామాలతో ఫేక్ పాస్‌పోర్టులు ఎక్కువగా పొందినట్లు గుర్తించారు.