కిడ్నీ రాకెట్‌‌‌‌ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..ఇప్పటికే 13 మంది అదుపులోకి

కిడ్నీ రాకెట్‌‌‌‌ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..ఇప్పటికే 13 మంది అదుపులోకి

 

  • ఒక్కో కిడ్నీకి రూ.10 లక్షలు వసూలు చేసిన నిందితులు
  • మిగతా నిందితుల కోసం గాలింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌  అలకనంద మల్టీ హాస్పిటల్‌‌‌‌  కిడ్నీ రాకెట్  కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలకు కిడ్నీలు సరఫరా చేస్తున్న మరో ఇద్దరిని రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితులను చెన్నైకి చెందిన శంకరణ్‌‌‌‌  అలియాస్  సాయి శంకరన్ (56), ఎన్‌‌‌‌. రమ్య (36) గా గుర్తించారు. వారిని సోమవారం చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ట్రాన్సిట్‌‌‌‌  వారంట్‌‌‌‌పై మంగళవారం హైదరాబాద్ కు తీసుకొచ్చారు.

విచారణ అనంతరం గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌కు తరలించారు. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో జనవరి 22న  సరూర్‌‌‌‌ ‌‌‌‌నగర్  పోలీస్  స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసులో హాస్పిటల్  నిర్వాహకులు, డాక్టర్లు సహా మొత్తం13 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్  చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

డోనర్‌‌‌‌‌‌‌‌కు రూ.4 లక్షలు, కమీషన్‌‌‌‌ రూ. 6 లక్షలు

కిడ్నీ రాకెట్  వ్యవహారంపై గత  నెల 24 నుంచి సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రాకెట్‌‌‌‌  మూలాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండడంతో సెర్చ్‌‌‌‌  ఆపరేషన్  చేశారు. తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్య స్థానికులను టార్గెట్‌‌‌‌  చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ట్రాప్‌‌‌‌  చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు డబ్బు ఆశ చూపారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్‌‌‌‌, పవన్‌‌‌‌  సహా మరికొంత మంది మధ్యవర్తులతో కలిసి కిడ్నీలు మార్పిడి చేశారు. ఇందుకుగాను శంకరన్, రమ్య ఒక్కో కిడ్నీకి రూ.10 లక్షలు తీసుకున్నారు.

ఇందులో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు కిడ్నీ డోనర్లకు అందించారు. ఇలా చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా కిడ్నీ రాకెట్‌‌‌‌  నిర్వహిస్తున్న వీరిద్దరిని అరెస్ట్  చేశామని సీఐడీ చీఫ్‌‌‌‌  శిఖాగోయల్‌‌‌‌  గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.