ఒకే రోజు, ఒకే ఎయిర్​పోర్టులో..రెండు విమానాలు క్రాష్

ఒకే రోజు, ఒకే ఎయిర్​పోర్టులో..రెండు విమానాలు క్రాష్

న్యూఢిల్లీ :  టాంజానియా దేశంలో ఒకే రోజు, ఒకే ఎయిర్ పోర్టులో రెండు విమానాలు క్రాష్​అయ్యాయి. గంటల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలు రెండూ ల్యాండ్ అయ్యే క్రమంలోనే జరిగాయి. రెండు విమానాల్లోనూ 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది చొప్పున ఉండగా..  ఈ ప్రమాదాల్లో ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. టాంజానియాలోని కికోబోగా ఎయిర్ పోర్టులో గత మంగళవారం జాంజిబార్ ఎయిర్ పోర్టు నుంచి 30 మంది ప్యాసింజర్లు, ముగ్గురు సిబ్బందితో యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం కికోబోగాకు బయలుదేరింది. 

కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా ఫ్లైట్ రన్ వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్ వే పై కొద్దిదూరం వెళ్లింది. ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి కికోబోగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇంకా తేరుకోకముందే.. మరో ప్రమాదం జరిగింది. కికోబోగా నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులను జాంజిబార్ చేర్చేందుకు పైలెట్ మరో ఇద్దరు సిబ్బంది రెడీ అయ్యారు. 

రన్ వే పై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్ ను ఢీ కొంది. నోస్ గేర్ కొలాప్స్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాల్లో విమానాలు బాగా దెబ్బతినగా.. ప్రయాణికులు, సిబ్బందికి ఏం కాలేదని అధికారులు తెలిపారు.