మావోయిస్టుల పేరిట బెదిరింపులు..ఇద్దరు అరెస్ట్

మావోయిస్టుల పేరిట  బెదిరింపులు..ఇద్దరు అరెస్ట్

హనుమకొండ, వెలుగు : నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను హనుమకొండ, సీసీఎస్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు ఫోన్లు, మావోయిస్టుల పేరుతో ఉన్న లెటర్​ప్యాడ్, బైక్​స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్​ రెడ్డి మంగళవారం వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపాడు గొల్లపల్లికి చెందిన దాసరి శ్రీకాంత్, వరంగల్​ కరీమాబాద్​ కు చెందిన బాలిన మహేశ్​ అనే స్నేహితులు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్​చేసి సీపీఐ మావోయిస్టు పార్టీ పేర బెదిరించడం మొదలు పెట్టారు. చర్ల,-శబరి ఏరియా కమిటీ కమాండర్ దేవన్నపేరిట లెటర్​ ప్యాడ్ తయారు చేసి.. ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సమీపంలోని ఎన్ఎస్ఆర్​ గ్రూప్​సంస్థలు, వరంగల్ లోని అజారా హాస్పిటల్​, దీపక్​ స్కిన్ క్లినిక్​లకు నాలుగు రోజుల కింద లెటర్​ పంపించారు.

 పాలను ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టు ఎన్​ఎస్ ఆర్​ డెయిరీ వారిని , రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ హాస్పటల్​ వారిని బెదిరించారు. ఎన్ఎస్ఆర్​ సంస్థల ఆస్తుల వివరాలు, హాస్పిటల్​లైసెన్స్ తో పాటు డబ్బులు తెచ్చి ఇవ్వాలని,  ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈడీ, సీబీఐకి పట్టిస్తామని, డబ్బులు ఇవ్వకపోతే నక్సలైట్ల చేతితో చస్తారంటూ ఫోన్​ చేసి బెదిరించారు. అనుమానం వచ్చిన ఎన్ఎస్ఆర్​గ్రూప్​యజమానులు ఆత్మకూరులో, అజారా, దీపక్​స్కిన్ క్లీనిక్​ ఓనర్లు హనుమకొండ పీఎస్​లో ఫిర్యాదు చేశాయి. నిందితుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ములుగురోడ్డు హనుమాన్​ జంక్షన్​వద్ద శ్రీకాంత్​ను పట్టుకున్నారు. అతని సమాచారం మేరకు వరంగల్ లోఉన్న మహేశ్ ను అరెస్ట్ చేశారు. ఎవరైనా ఫోన్​ చేసి బెదిరిస్తే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ సూచించారు.