వికారాబాద్, వెలుగు: హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు ఎల్బీనగర్ ప్రత్యేకకోర్టు రెండుసార్లు జీవిత ఖైదు విధించింది. వికారాబాద్ ఎస్పీ స్నేహ వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట పరిధిలోని నారేగూడ గ్రామానికి చెందిన ప్రభాకర్ ను 2014లో పాత కక్షలను మనసులో పెట్టుకొని కొత్తపల్లి లక్ష్మి, కొత్తపల్లి సత్యనారాయణ కొట్టి చంపారు.
ఈ ఘటనలో బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు.. హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం పూర్తి ఆధారాలతో నిందితులను ఎల్బీ నగర్లోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పర్చగా, ఈ కేసులో జడ్జి ఎం. భవాని శుక్రవారం కీలక తీర్పు వెలువరించారు. హత్యా నేరంలో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల జరిమానా విధించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ లో కూడా ఇద్దరికి జీవిత ఖైదుతోపాటు ఒక్కోక్కరికి రూ.15 వేల జరిమానా వేశారు. అయితే, నేర తీవ్రతను బట్టి కోర్టు రెండుసార్లు యావజ్జీవం విధించినప్పటీకి వీటిని నిందితులను ఏకకాలంలోనే అనుభవించాల్సి ఉంటుంది.

