న్యూఢిల్లీ: ఎకానమీలో రెండు వేల రూపాయిల నోట్లు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి సర్క్యులేషన్లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ. 2,000 నోట్ల సంఖ్య కేవలం 214 కోట్లు (మొత్తం కరెన్సీలో 1.6 శాతం) అని ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి సర్క్యులేషన్లో ఉన్న మొత్తం నోట్ల సంఖ్య 13,053 కోట్లుగా ఉంది. కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ 12,437 కోట్లుగా ఉంది. 2020 ముగిసేనాటికి వ్యవస్థలో సర్క్యులేషన్లో ఉన్న రూ. 2 వేల నోట్ల సంఖ్య 274 కోట్లుగా రికార్డయ్యింది. అప్పుడు సర్క్యులేషన్లో ఉన్న మొత్తం నోట్ల సంఖ్యలో ఈ నెంబర్ 2.4 శాతానికి సమానం. అక్కడి నుంచి రూ. 2 వేల నోట్ల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆర్బీఐ పేర్కొంది. వాల్యూ పరంగా చూస్తే సర్క్యులేషన్లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ. 2 వేల నోట్ల వాల్యూ 2020 మార్చిలో 22.6 శాతంగా ఉండగా, 2021 లో 17.3 శాతానికి, 2022 లో 13.8 శాతానికి తగ్గిందని ఆర్బీఐ వివరించింది.
రూ. 500 నోట్లు పెరిగాయ్..
ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం, వ్యవస్థలో రూ. 500 నోట్లు పెరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి రూ. 500 నోట్ల సంఖ్య 4,554.68 కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ 3,867.90 కోట్లుగా ఉంది. వాల్యూమ్ పరంగా చూస్తే, మార్చి నాటికి వ్యవస్థలో సర్క్యులేట్ అవుతున్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ. 500 నోట్ల వాటానే (34.9 శాతం) ఎక్కువగా ఉందని ఆర్బీఐ వివరించింది. ఆ తర్వాత రూ. 10 నోట్ల వాటా (21.3 శాతం) ఎక్కువగా ఉందని తెలిపింది. కిందటేడాది మార్చి నాటికి వ్యవస్థలో సర్క్యులేట్ అవుతున్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ. 500 నోట్ల వాటా 31.1 శాతంగా ఉంది. వ్యవస్థలో సర్క్యులేట్ అవుతున్న మొత్తం కరెన్సీ నోట్ల వాల్యూ రూ. 31.05 లక్షల కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ రూ. 28.27 లక్షల కోట్లుగా ఉంది. వాల్యూ పరంగా చూస్తే ఈ మొత్తం వాల్యూలో రూ. 500, రూ. 2000 నోట్ల వాటానే 87.1 శాతంగా ఉంది. వ్యవస్థలో వాల్యూ పరంగా బ్యాంక్ నోట్లు 9.9 శాతం పెరగగా, వాల్యూమ్ పరంగా 5 శాతం పెరిగాయి. మరోవైపు డిజిటల్ కరెన్సీని వివిధ దశల్లో లాంచ్ చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది.