వలిగొండ మండలంలో లారీ కింద పడి ఇద్దరు యువకులు మృతి

వలిగొండ మండలంలో లారీ కింద పడి ఇద్దరు యువకులు మృతి
  • ఓవర్ టేక్ చేయబోయి బైక్  అదుపు తప్పడంతో ప్రమాదం
  • యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో ఘటన

యాదాద్రి, వెలుగు: బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్​ టేక్​ చేయబోయి లారీ టైర్ల కింద పడి చనిపోయారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడం, దాచారం గ్రామాలకు చెందిన కుక్కల సాయి(20), బోళ్ల దీక్షిత్(20) ఆదివారం బైక్​పై భువనగిరికి బయలుదేరారు. వలిగొండ మండలం నరసాపురం శివారులో స్టీల్​లోడ్​తో ముందు వెళ్తున్న లారీని ఓవర్​టేక్​ చేయడానికి ప్రయత్నించారు. 

ఈక్రమంలో వారిద్దరు పడిపోవడం, వారి పైనుంచి లారీ వెళ్లడంతో టైర్ల కింద నలిగిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని టైర్ల కింద నలిగిపోయిన డెడ్ బాడీలను అతికష్టం మీద తొలగించారు. వీరిద్దరూ ఆయా కుటుంబాల్లో ఒక్కరే సంతానం కావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు