ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ‘మహా వికాస్ ఆగాధీ’ అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో పాస్ అయింది. శనివారం జరిగిన బలపరీక్షలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 169 మంది సభ్యులు మద్దతు తెలిపారు. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు రూల్స్కు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ సభను బాయ్కాట్ చేసింది. మరో నలుగురు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాలేదు. గవర్నర్ ఆదేశాల మేరకు శనివారం సభ ప్రత్యేకంగా సమావేశమైంది. మాజీ సీఎం అశోక్ చవాన్ బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, ఎన్సీపీ, శివసేన సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏఐఎంఐఎం, సీపీఎం, ఎంఎన్ఎస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదని ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే ప్రకటించారు. ఓటింగ్ కు సిద్ధమవుతుండగా బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం నిబంధనల ప్రకారం జరగలేదని, బల పరీక్ష నిర్వహించొద్దని నినాదాలు చేశారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించి తీరతామని ప్రొటెం స్పీకర్ తేల్చిచెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత జరిగిన ఫ్లోర్ టెస్ట్లో హెడ్కౌంట్ ద్వారా ఉద్ధవ్ థాక్రేకు 169 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.
పేరెంట్స్ ను గుర్తుచేస్కోవడం నేరమా?:థాక్రే
బల పరీక్ష నెగ్గిన తర్వాత.. తనపై నమ్మకముంచిన సభ్యులందరికీ థ్యాంక్స్ అని సీఎం ఉద్ధవ్ థాక్రే చెప్పారు. మీ ఆశీర్వాదం లేకుంటే నేనిక్కడ ఉండే వాడినే కాదంటూ రాష్ట్ర ప్రజలకూ ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రమాణ స్వీకారంలో ఛత్రపతి శివాజీతో పాటు బాలా సాహెబ్ థాక్రే పేర్లను ప్రస్తావించడంపై బీజేపీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. శివాజీని స్మరించుకోవడం, తల్లిదండ్రులను గుర్తుచేసుకోవడం నేరమా అంటూ బీజేపీని నిలదీశారు. శివాజీ పేరెత్తితే బీజేపీ ఉలిక్కిపడుతోందని ఎగతాళి చేశారు. తల్లిదండ్రులను స్మరించుకోని వ్యక్తికి ఈ భూమ్మీద ఉండే హక్కు లేదని థాక్రే విమర్శించారు.
బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్
రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీని ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రూల్స్ ప్రకారం జరగలేదని ఆరోపిస్తూ బీజేపీ శాసన సభ పక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. ప్రొటెం స్పీకర్ మార్పునూ ఆయన తప్పుబట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ‘‘రెగ్యులర్ స్పీకర్ ఉంటే బలపరీక్షలో ఓడిపోతామని భయపడే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి భయపడింది. ప్రొటెం స్పీకర్ను మార్చి మరో ప్రొటెం స్పీకర్ను నియమించడం దేశచరిత్రలోనే మొదటిసారి” అని బీజేపీ ఆరోపించింది.
స్పీకర్ పోస్ట్కు కాంగ్రెస్, బీజేపీ పోటీ
మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్పదవికి ఆదివారం ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ కేండిడేట్గా నానా పటోలె , బీజేపీ అభ్యర్థిగా కిషన్ కథోరే పోటీలో ఉన్నారు. పటోలె విదర్భలోని శాకోలి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ కేండిడేట్ కథోరే ముర్బాద్ఎమ్మెల్యేగా ఉన్నారు.