సెప్టెంబర్ నుంచి కాలేజీలు స్టార్ట్ చేయడం బెటర్

సెప్టెంబర్ నుంచి కాలేజీలు స్టార్ట్ చేయడం బెటర్
  • కేంద్రానికి యూజీసీ సిఫార్సు

న్యూఢిల్లీ: ఈ ఏడాది అకడమిక్ ఇయర్ ను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సూచించింది. కరోనా ఎఫెక్టును దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు.. అకడమిక్ సెషన్ ను జూలైకి బదులుగా సెప్టెంబర్ నుంచి ప్రారంభించవచ్చని యూజీసీ నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. దేశవ్యాప్త లాక్​డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీలు, కాలేజీల సమస్యలను పరిశీలించేందుకు యూజీసీ రెండు కమిటీలను వేసింది. విద్యాసంవత్సరం నష్టంతో పాటు ఆన్​లైన్ విద్య గురించి ఆ కమిటీలు స్టడీ చేశాయి. హర్యానా వర్సిటీ వీసీ ఆర్సీ కుహద్ నేతృత్వంలోని ఒక కమిటీ వర్సిటీ పరీక్షల గురించి అధ్యయనం చేసింది. ఇగ్నో వీసీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్ లైన్ పరీక్షల గురించి రిపోర్టు తయారు చేసింది. ఈ రెండు కమిటీలు కేంద్ర ప్రభుత్వానికి తమ రిపోర్టులను సమర్పించాయి.

సాధ్యమైతే ఆన్​లైన్ పరీక్షలు
సెప్టెంబర్ నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని ఒక కమిటీ సిఫార్సు చేయగా.. సదుపాయాలున్న యూనివర్సిటీలు ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించాలని మరో కమిటీ రిపోర్టు సిఫార్సు చేసింది. లేదంలే లాక్​డౌన్ ఎత్తివేసేంతవరకు వెయిట్ చేసి.. ఎప్పటిలానే పరీక్షలు నర్వహించేందుకు తేదీలను నిర్ణయించాలని సూచించింది. ఈ రెండు రిపోర్టుల సిఫార్సులను స్టడీ చేసిన తర్వాత వచ్చే వారం నాటికి అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు హ్యూమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ అధికారులు ప్రకటించారు. కరోనా ఎఫెక్టుతో మార్చి 16 నుండి దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలు మూసివేశారు. మార్చి 24 న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కొనసాగుతోంది.