హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెలలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం (జూన్ 19న) కేంద్రం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టు సీజేగా కొనసాగుతున్న సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీజేగా పదోన్నతి లభించింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964, ఆగస్ట్ 2వ తేదీన గువాహటిలో జన్మించారు. గువాహటిలోని డాన్బాస్కో పాఠశాలలో విద్యనభ్యసించారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా చేరారు. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సుల మేరకు ఐదుగురు న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్లుగా పదోన్నతి దక్కింది.
జస్టిస్ విపిన్ సంఘీ (ప్రస్తుతం ఢిల్లీ) - ఉత్తరాఖండ్ హైకోర్టు
జస్టిస్ ఏఏ సయ్యద్ (ప్రస్తుతం బొంబాయి) - హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు
జస్టిస్ ఎస్ఎస్ షిండే (ప్రస్తుతం బొంబాయి) - రాజస్థాన్ హైకోర్టు
జస్టిస్ రష్మిన్ ఎం ఛాయా (ప్రస్తుతం గుజరాత్) - గౌహతి హైకోర్టు
జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (ప్రస్తుతం తెలంగాణ) - తెలంగాణ హైకోర్టు