
ఉక్రెయిన్, రష్యా మధ్య పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతుంటే.. బదులుగా ఉక్రెయిన్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ టార్గెట్ గా డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలిసింది. ఈ దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నారని రష్యా మిలటరీ కమాండర్ చెప్పారు. మే 20న ఉక్రెయిన్ ఈ దాడికి యత్నించిందని, దాడి సమయంలో రష్యా వైమానిక దళం 46 డ్రోన్లను ధ్వంసం చేసిందని రష్యా ప్రకటించింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని పుతిన్ విజిట్ చేసిన సమయంలో ఆయన హెలికాఫ్టర్పై ఉక్రెయిన్ దాడికి యత్నించినట్లు సమాచారం.
ఇక.. ఉక్రెయిన్పై రష్కా అతిపెద్ద వైమానిక దాడులు చేసింది. డ్రోన్లు, మిసైళ్లతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు రష్యా ఈ దాడులు నిర్వహించింది. 2022 ఫిబ్రవరిలోరెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఈ స్థాయిలో ఎయిర్ స్ట్రయిక్స్ చేయడం ఇదే మొదటిసారి. 367 డ్రోన్లు.. మిసైళ్లతో రష్యా తమపై దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి యురీ స్తత్ తెలిపారు. రష్యా మొత్తంగా 69 మిసైల్స్, 298 డ్రోన్లు వాడిందని మీడియాకు ఇన్హత్ వెల్లడించారు. సాధారణ నగరాలపై శత్రు దేశం కనికరం లేకుండా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు.