హైదరాబాద్, వెలుగు: ఇండియాలో అత్యంత సంపన్నుల (అల్ట్రా హైనెట్వర్త్ వెల్తీ ఇండివిడ్యువల్స్–యూహెచ్ఎన్డబ్ల్యూఐ) సంఖ్య రాబోయే ఐదేళ్లలో రెట్టింపు కానుంది. 30 మిలియనీర్ల డాలర్లు (దాదాపు రూ.219 కోట్లు), అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారిని అల్ట్రావెల్తీ పీపుల్గా పిలుస్తారు. 2024 వరకు వీరి సంఖ్య 73 శాతం పెరిగి 10,354కు చేరుకుంటుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ‘నైట్ఫ్రాంక్’ తాజా రిపోర్టు ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఏడుశాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల సంపన్నుల సంఖ్య పెరుగుతుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఇండియా జీడీపీ కేవలం 4.7 శాతం మాత్రమే రికార్డు అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జీడీపీ రేటు ఐదు శాతం ఉంటుందని అంచనా. ఈ దశాబ్దంలో ఇదే అతి తక్కువ రేటు. ఇన్వెస్ట్మెంట్లు, డిమాండ్ పడిపోవడం, తయారీరంగం దెబ్బతినడం ఇందుకు కారణాలు. ఎకానమీ స్లోడౌన్ను అడ్డుకోవడానికి చాలా చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
స్థిరాస్తులపై ఫోకస్
మనదేశంలో స్థిరాస్తుల రంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఇండియా యూహెచ్ఎన్డబ్ల్యూఐలు మాత్రం ఈ సెక్టార్లోకి ఇన్వెస్ట్మెంట్లను గుమ్మరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది రియల్టీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు రెడీ అవుతున్నారు. కమర్షియల్ ప్రాపర్టీలు కొంటామని 26 శాతం మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు వెల్లడించారు. ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఏఐ దేశాల్లో ప్రాపర్టీలు కొంటామని 15 శాతం మంది ప్రకటించారు. క్వాలిటీ లైఫ్ ఉండే ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రియల్టీలో అన్నింటికంటే ఆఫీస్ సెక్టార్ మేలని ప్రైవేటు క్యాపిటల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. హెల్త్కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ రంగాల్లో లాభాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
ఈక్విటీవైపు చూపు
ఇండియాలోని యూహెచ్ఎన్డబ్ల్యూఐలలో 29 శాతం మంది గత ఏడాది ఈక్విటీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 21 శాతం మంది బాండ్లవైపు మొగ్గుచూపారు. 20 శాతం మంది ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రైవేట్ ఈక్విటీల్లో పెట్టుబడులు 2018లో ఏడుశాతం ఉండగా, 2019లో ఇవి ఏడు శాతానికి పెరిగాయి. ఇక నుంచి కూడా ప్రైవేటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తామని 85 శాతం మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు ప్రకటించారు.
దానాల్లో దిట్టలు..
మనదేశంలో యూహెచ్ఎన్డబ్ల్యూఐలలో 67 శాతం మంది గత ఏడాది దానధర్మాలకు ఖర్చును పెంచారు. అన్నింటికంటే విద్యాభివృద్ధికి ఎక్కువ విరాళాలు ఇస్తామని తెలిపారు. ఇక, ‘సిటీ వెల్త్ ఇండెక్స్’లో ముంబై, ఢిల్లీ, బెంగళూరులో వరుసగా 44, 58, 89 స్థానాల్లో నిలిచాయి.
ముఖ్యాంశాలు
- రాబోయే ఐదేళ్లలో సంపద విషయంలో ఏషియా యూరప్ను మించిపోతుంది. ఏషియా దేశాల్లోని యూహెచ్ఎన్డబ్ల్యూఐల సంపద 44 శాతం పెరుగుతుంది. జీడీపీ రేటు 2024 నాటికి ఏడుశాతానికి చేరుతుంది.
- ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కొత్తగా 31 వేల మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలుగా మారారు. ప్రస్తుతం వీరి సంఖ్య 5.13 లక్షలకు చేరింది. ఇండియాలో 2024 నాటికి యూహెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య 10,354కు చేరుతుందని అంచనా.
- ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ స్లోడౌన్తో ఆందోళన చెందుతున్నామని ఇండియాలో ఎక్కువ మంది యూహెచ్ఎన్డబ్ల్యూఐలు తెలిపారు. ట్రేడ్వార్లు, రాజకీయ పరిస్థితులు, అవినీతి తమకు ఇబ్బందిగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
- మనదేశంలో గత ఏడాది బిలియనీర్ల సంఖ్య 104 మంది కాగా, 2024 నాటికి వీరి సంఖ్య 113కు చేరుతుందని అంచనా.
- 200 దేశాలకు చెందిన 620 మంది ప్రైవేటు బ్యాంకర్లు, వెల్త్అడ్వైజర్ల అభిప్రాయాలతో ‘వెల్త్ రిపోర్ట్ 2019’ను తయారు చేసినట్టు నైట్ఫ్రాంక్ ప్రకటించింది.