ఇండియా సిమెంట్స్‌‌ ప్లాంట్ కొననున్న అల్ట్రాటెక్ సిమెంట్‌‌

ఇండియా సిమెంట్స్‌‌ ప్లాంట్ కొననున్న అల్ట్రాటెక్ సిమెంట్‌‌
  •     డీల్‌‌ విలువ రూ.315 కోట్లు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఇండియా సిమెంట్స్‌‌ గ్రైండింగ్ ప్లాంట్‌‌ను రూ.315 కోట్లకు అల్ట్రాటెక్ సిమెంట్‌‌ కొనుగోలు చేయనుంది.  ఈ ప్లాంట్ కెపాసిటీ 1.1 మిలియన్ టన్స్​ పర్ యానమ్‌‌ (ఎంటీపీఏ). ‘1.1 ఎంటీపీఏ కెపాసిటీ, రైల్వే సైడింగ్‌‌  ఉన్న  పార్లిలోని (మహారాష్ట్ర)  ఇండియా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్‌‌ను  కొనుగోలు చేయడానికి కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు’ అని అల్ట్రాటెక్ సిమెంట్‌‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది.  

మహారాష్ట్ర మార్కెట్‌‌లో మరింతగా విస్తరించడానికి ఈ ప్లాంట్ సాయపడుతుందని వెల్లడించింది.    రానున్న మూడేళ్లలో క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్ కింద రూ.32 వేల కోట్లను ఖర్చు చేస్తామని  ఈ నెల ప్రారంభంలో  కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా ఛత్తీస్‌‌గడ్‌‌, తమిళనాడులో నిర్మించిన రెండు గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్లను ఈ నెల 2 న ప్రారంభించింది.