
- కొలువులియ్యకపోతే మీకు ఎమ్మెల్సీ ఎందుకు... రిజైన్ చేయండి
- చిక్కడపల్లి జాబ్ మేళాలో నిరుద్యోగుల మండిపాటు
హైదరాబాద్: చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాపై నిరుద్యోగులు మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇయ్యకుండా జాబ్ మేళా డ్రామాలేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. జాబ్ మేళాను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవిని అడ్డుకున్నారు. తమ ఓట్లతో గెలిచి ఎమ్మెల్సీగా ఉన్న వాణి దేవి ఉద్యోగాలు కల్పించకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిధులు, నీళ్లు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మహత్యలు తప్ప ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు వాపోయారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతే.. తెలంగాణ ఎవరికోసం, ఎందుకోసం ఏర్పడిందో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50 వేల ఉద్యోగాలు ప్రకటించిన కేసీఆర్.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. నిరుద్యోగుల మాటలు విన్న ఎమ్మెల్సీ వాణి దేవి.. సీఎం కేసీఆర్తో మాట్లాడుతానన్నారు. అయితే ఉద్యోగాలపై ముఖ్యమంత్రితో మాట్లాడకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. దాంతో శాసనమండలిలో నిరుద్యోగుల తరపున మాట్లాడతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ఆందోళన ఎక్కువ కావడంతో.. ఎమ్మెల్సీని పోలీసులు తమ వాహనంలో అక్కడినుంచి పంపించారు. కాగా.. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగాలపై ప్రకటన చేయకుంటే.. జిల్లాలు, మండలాలు, రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపడతామని నిరుద్యోగులు హెచ్చరించారు. ఆందోళనకు దిగిన నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
For More News..