కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు( ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో ఈ బడ్జెట్ను యువ శక్తి బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రధాని మోదీ వినూత్న ఆలోచనలే ఈ బడ్జెట్కు మూలస్తంభాలని, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు. విశేషమేమిటంటే, కర్తవ్య భవన్లో రూపొందించిన మొట్టమొదటి బడ్జెట్ ఇదే. ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి మూడు ప్రధాన కర్తవ్యాలను, వాటికి ఊతమిచ్చే మూడు అవసరాలను ప్రతిపాదించింది:
ప్రభుత్వ మూడు ప్రధాన కర్తవ్యాలు:
*దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా, నిలకడగా ముందుకు తీసుకెళ్లడం.
*ప్రజల ఆకాంక్షలను గుర్తించి, వారి నైపుణ్యాలను, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం.
*"సబ్కా సాథ్, సబ్కా వికాస్" దార్శనికతతో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలను అందించడం.
ఈ లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన వాతావరణం అవసరమని పేర్కొంటూ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా సంస్కరణల వేగాన్ని కొనసాగించడం, మూలధన కేటాయింపులను క్రమబద్ధీకరించడం, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను అమలు చేయడం, సుపరిపాలన (Good Governance) అందించడానికి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), అధునాతన టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం ప్రస్తావించారు.
