రెండేండ్లలో3.50 కోట్ల ఉద్యోగాలు..లక్ష కోట్లతో ఈఎల్ఐ స్కీమ్

రెండేండ్లలో3.50 కోట్ల ఉద్యోగాలు..లక్ష కోట్లతో ఈఎల్ఐ స్కీమ్
  • రూ.1.07 లక్షల కోట్లతో ఈఎల్ఐ​ స్కీమ్
  • కొత్త కొలువులిచ్చే సంస్థలకు రెండేండ్లు ప్రోత్సాహం
  • కేంద్ర కేబినెట్​ కీలక నిర్ణయాలు
  • నేషనల్​ స్పోర్ట్స్​ పాలసీకి ఓకే
  • తమిళనాడులో 4 లేన్ ​రోడ్డుకు రూ. 1,853 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉపాధిని పెంచేలా ఎంప్లాయిమెంట్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ స్కీమ్ (ఈఎల్ఐఎస్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్​ కోసం రూ.1.07 లక్షల కోట్లు కేటాయించింది. ఈపీఎఫ్​వో నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాల ద్వారా రాబోయే రెండేండ్లలో 3.50 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.  

మంగళవారం ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్​ పలు కీలక  నిర్ణయాలను తీసుకున్నది.  రూ.3 లక్షల కోట్లకు పైగా విలువచేసే పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్​ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌ మీడియాకు వెల్లడించారు. 

ఎంప్లాయిమెంట్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ స్కీమ్ (ఈఎల్ఐఎస్)తోపాటు రీసెర్చ్​ డెవలప్​మెంట్ అండ్​ ఇన్నోవేషన్​ స్కీమ్​​ (ఆర్‌‌‌‌‌‌‌‌డీఐ), నేషనల్​స్పోర్ట్స్​ పాలసీ–-2025, తమిళనాడులో పరమకుడి–-రామనాథపురం జాతీయ రహదారిని 4 లేన్లుగా విస్తరించడానికి కేబినెట్​ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.

ఉపాధికి ఊపు తెచ్చేలా ఈఎల్ఐ స్కీమ్ 

మాన్యుఫాక్చరింగ్ ​రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు ఈఎల్ఐ స్కీమ్​ను తీసుకొచ్చినట్టు అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు.  ఈ స్కీమ్​ ద్వారా వచ్చే రెండేండ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 

ఈఎల్ఐ స్కీమ్‌‌‌‌లో భాగంగా మొదటిసారి ఉద్యోగంలో చేరినవారికి  ప్రభుత్వం ఒక నెల జీతం ఇస్తుంది.  కొత్త ఉద్యోగాలు సృష్టించినందుకు యజమానులకు ప్రభుత్వం ఇన్సెంటివ్స్​ ఇస్తుంది. ఈ ప్రోత్సాహకాలు రెండేండ్లపాటు కొనసాగుతాయి.  మాన్యుఫాక్చరింగ్ సెక్టార్​కు మరో రెండేండ్లు అంటే నాలుగేండ్లపాటు ఇస్తుంది.  తొలిసారిగా ఉద్యోగాలు పొందేటోళ్ల సంఖ్య కోటీ 92 లక్షల మంది.. లక్షలోపు జీతాలు వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. 

ఉద్యోగాలు కల్పించే యజమానులకు 2 ఏండ్ల పాటు ప్రతి ఎంప్లాయ్​మెంట్​కు నెలకు రూ.3,000 వరకు ఇన్సెంటివ్  ​అందుతుంది. కనీసం 6 నెలలు వారి సంస్థల్లో ఉద్యోగ కల్పన కొనసాగించాలి. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను కల్పించేందుకు ఈఎల్ఐ స్కీమ్​ను 2024–-25 కేంద్ర బడ్జెట్‌‌‌‌లో సర్కారు ప్రకటించింది.  దీని మొత్తం బడ్జెట్ వ్యయం 
రూ. 2 లక్షల కోట్లని అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు.  

ఖేలో భారత్​నీతి’కి ఆమోదం

దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం, క్రీడాకారుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నేషనల్​స్పోర్ట్స్​ పాలసీ– -2025కు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. దీనికి ‘ఖేలో భారత్​నీతి’ అని పేరు పెట్టింది. ప్రపంచ క్రీడల్లో భారత్​ ఐదో అతిపెద్ద దేశంగా ఎదిగేందుకు ఈ పాలసీ ‘వ్యూహాత్మక రోడ్ మ్యాప్’ అని అభివర్ణించింది. 2036 ఒలింపిక్స్​లో భారత్​ గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. 

తమిళనాడులో 4 లేన్​ హైవేకు 1,853 కోట్లు

తమిళనాడులోని పరమకుడి-–రామనాథపురం హైవే(ఎన్​హెచ్​87) 4 లేన్‌‌‌‌ విస్తరణకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద 46.7 కిలో మీటర్ల పొడవైన హైవే నిర్మాణానికి రూ.1853 కోట్లను ఖర్చు చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్​) ద్వారా ఈ రోడ్డును విస్తరించనున్నట్టు అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు.  దీంతో రాష్ట్రంలోని  ప్రధాన నగరాల మధ్య ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అవుతుందని, రోడ్​ కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు.

రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​లో ​ప్రైవేట్ పెట్టుబడులు..

పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణల​ రంగంలో ప్రైవేట్​ పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా  రీసెర్చ్​ డెవలప్​మెంట్ అండ్​ ఇన్నోవేషన్​ స్కీమ్​​ (ఆర్‌‌‌‌‌‌‌‌డీఐ)కు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. ఈ స్కీమ్‌‌‌‌కు రూ.లక్ష కోట్ల కేటాయింపునకు కేబినెట్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఆర్‌‌‌‌డీఐలో ప్రైవేటు సెక్టార్​ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తక్కువ వడ్డీ రేటు లేదా వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌‌‌‌ లేదా రీఫైనాన్సింగ్‌‌‌‌ అందించడమే ఈ పథకం లక్ష్యం.  

వ్యూహాత్మక- అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆవిష్కరణలను వేగంగా ట్రాక్ చేయడానికి విద్యావేత్తలు, స్టార్టప్‌‌‌‌లు, పరిశ్రమల మధ్య సహకారాన్ని ఆర్‌‌‌‌డీఐ స్కీం ప్రోత్సహిస్తుందని అశ్వినీ వైష్ణవ్​ చెప్పారు.