2 మల్టీ ట్రాక్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

2 మల్టీ ట్రాక్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • ఏపీ, కర్నాటక, జార్ఖండ్​లోని 7 జిల్లాల్లో ప్రాజెక్టులు 
  • రూ. 6,405 కోట్లతో రైల్వేకు కొత్తగా 318 కి.మీ. నెట్ వర్క్  

న్యూఢిల్లీ:  ఏపీ, కర్నాటక, జార్ఖండ్ లోని 7 జిల్లాల్లో రెండు మల్టీ ట్రాక్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ కమిటీ ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. జార్ఖండ్ లోని కొడెర్మా నుంచి బర్కాకనా వరకూ 133 కిమీల పొడవున ఒక ప్రాజెక్టు, కర్నాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల నుంచి ఏపీలోని అనంతపురం జిల్లా మధ్య 185 కిమీల పొడవున మరో ప్రాజెక్టును చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. 

మొత్తం 318 కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్ కోసం రూ. 6,405 కోట్ల వ్యయానికి ఓకే చెప్పింది. మల్టీ ట్రాక్ ప్రాజెక్టుల వల్ల 7 జిల్లాల్లోని 28 లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలగనుంది. ఆయా ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, స్టీల్, సిమెంట్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి సరుకుల రవాణా మెరుగుపడనుందని కేంద్రం వెల్లడించింది.