- కేంద్ర మంత్రి మన్సుఖ్
- సిరప్ శాంపిల్స్ సేకరించిన అధికారులు
- రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామన్న మంత్రి
న్యూఢిల్లీ/నోయిడా : డాక్–1 మాక్స్ దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్లో 18 మంది పిల్లలు చనిపోయిన ఘటనపై మన కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. యూపీలోని నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ ఈ సిరప్ తయారు చేసింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణల క్రమంలో డాక్–1 మాక్స్ తయారీని ఆపేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ), ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ కలిసి దర్యాప్తు చేపడుతాయన్నారు. ఫార్మా కంపెనీని తనిఖీ చేశాక.. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు కంపెనీకి వెళ్లి శాంపిల్స్ సేకరించి చండీగఢ్లోని రీజినల్ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి పంపించారన్నారు. డాక్–1 మ్యాక్స్ సిరప్ యూపీ నుంచి కేవలం ఉజ్బెకిస్తాన్కే ఎగుమతి అయినట్టు గుర్తించామన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, 10 ఏండ్లుగా సేవలు అందిస్తున్నామని మరియన్ బయోటెక్ లీగల్ ప్రతినిధి హసన్ హార్రీస్ తెలిపారు. గవర్నమెంట్ రిపోర్టు వచ్చే దాకా తయారీని నిలిపేసినట్టు వివరించారు. ఈ సిరప్ మన దేశంలో ఎక్కడా సప్లై చేయబోమంటూ కంపెనీ అండర్టేకింగ్ ఇచ్చినట్టు సమాచారం.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఇండియాలో తయారైన దగ్గు మందులు పిల్లల ప్రాణాల మీదికొస్తున్నాయని, మొదట గాంబియాలో 70 మంది పిల్లలు చనిపోయారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్విట్టర్లో విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఉజ్బెకిస్తాన్లో 18 మంది చనిపోయారన్నారు. ఇండియాను ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా గొప్పలు చెప్పుకోవడం మోడీ ప్రభుత్వం మానుకోవాలని, ఫార్మా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాంబియాలో చిన్నారులు చనిపోయింది ఇండియన్ దగ్గు మందు వల్ల కాదని, ఇదే విషయాన్ని అక్కడి అధికారులు కూడా స్పష్టం చేశారని బీజేపీ ఐటీ డిపార్ట్మెంట్ ఇన్చార్జ్ అమిత్ మాలవీయ స్పష్టం చేశారు. మోడీపై ద్వేషంతో ఇండియన్ ఇండస్ర్టియల్ స్ఫూర్తిని కాంగ్రెస్ దెబ్బతీస్తోందన్నారు.
