ఉజ్బెకిస్తాన్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశం

ఉజ్బెకిస్తాన్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశం
  • కేంద్ర మంత్రి మన్​సుఖ్ 
  • సిరప్ శాంపిల్స్ సేకరించిన అధికారులు
  • రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామన్న మంత్రి

న్యూఢిల్లీ/నోయిడా : డాక్‌‌–1 మాక్స్‌‌ దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్​లో 18 మంది పిల్లలు చనిపోయిన ఘటనపై మన కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. యూపీలోని నోయిడాకు చెందిన మరియన్‌‌ బయోటెక్‌‌ కంపెనీ ఈ సిరప్ తయారు చేసింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణల క్రమంలో డాక్‌‌–1 మాక్స్ తయారీని ఆపేయాలని కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ గురువారం ఆదేశించారు. సెంట్రల్ డ్రగ్స్‌‌ స్టాండర్డ్‌‌ కంట్రోల్‌‌ ఆర్గనైజేషన్(సీడీఎస్​సీఓ), ఉత్తరప్రదేశ్‌‌ డ్రగ్స్‌‌ కంట్రోలింగ్ అండ్‌‌ లైసెన్సింగ్ అథారిటీ కలిసి దర్యాప్తు చేపడుతాయన్నారు. ఫార్మా కంపెనీని తనిఖీ చేశాక.. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు కంపెనీకి వెళ్లి శాంపిల్స్​ సేకరించి చండీగఢ్​​లోని రీజినల్​ డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి పంపించారన్నారు. డాక్‌‌–1 మ్యాక్స్​ సిరప్ యూపీ నుంచి కేవలం ఉజ్బెకిస్తాన్​కే ఎగుమతి అయినట్టు గుర్తించామన్నారు. తమ వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, 10 ఏండ్లుగా సేవలు అందిస్తున్నామని మరియన్​ బయోటెక్​ లీగల్​ ప్రతినిధి హసన్​ హార్రీస్​ తెలిపారు. గవర్నమెంట్​ రిపోర్టు వచ్చే దాకా తయారీని నిలిపేసినట్టు వివరించారు. ఈ సిరప్​ మన దేశంలో ఎక్కడా సప్లై చేయబోమంటూ కంపెనీ అండర్​టేకింగ్ ఇచ్చినట్టు సమాచారం. 

కాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

ఇండియాలో తయారైన దగ్గు మందులు పిల్లల ప్రాణాల మీదికొస్తున్నాయని, మొదట గాంబియాలో 70 మంది పిల్లలు చనిపోయారని కాంగ్రెస్ జనరల్​ సెక్రటరీ జైరాం రమేశ్​ ట్విట్టర్​లో విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఉజ్బెకిస్తాన్​లో 18 మంది చనిపోయారన్నారు. ఇండియాను ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా గొప్పలు చెప్పుకోవడం మోడీ ప్రభుత్వం మానుకోవాలని, ఫార్మా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాంబియాలో చిన్నారులు చనిపోయింది ఇండియన్​ దగ్గు మందు వల్ల కాదని, ఇదే విషయాన్ని అక్కడి అధికారులు కూడా స్పష్టం చేశారని బీజేపీ ఐటీ డిపార్ట్​మెంట్ ఇన్​చార్జ్​ అమిత్​ మాలవీయ స్పష్టం చేశారు. మోడీపై ద్వేషంతో ఇండియన్ ఇండస్ర్టియల్ స్ఫూర్తిని కాంగ్రెస్​ దెబ్బతీస్తోందన్నారు.