
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2025, జూలై 24న విచారణకు హాజరై సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది. ఈ క్రమంలో సిట్ నోటీసులపై బుధవారం (జూలై 23) బండి సంజయ్ స్పందించారు. వర్షకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతోన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 2025, జూలై 28న విచారణకు హాజరు అవుతానని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఓ వైపు నిందితులను విచారిస్తూనే.. మరోవైపు బాధితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. సిట్ నోటీసుల మేరకు 2025, జూలై 24న విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు.
కానీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జూలై 24న విచారణకు రాలేనని బండి సంజయ్ సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఫహీం ఖురేషి తదితర నేతల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది.