నీతి ఆయోగ్ కు దూరంగా ఉన్న సీఎంలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ కంటే కేసీఆర్ కు ముఖ్యమైన పనేముందని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ కు వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో పేదరికం లేనట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రాన్ని, ప్రధానిని విమర్శించడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాలను ఏకం చేసుకుని మోడీ ముందుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండని.. ఆదాయానికి మించి అప్పలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూములు అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.
రైతుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పిల్లలు పుట్టినా కళ్యాణ లక్ష్మీ డబ్బులు అందడం ఇంత వరకు అందడం లేదన్నారు. పాత అప్పుల వడ్డీలకు సంవత్సరానికి 20 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.50 లక్షల కోట్ల అప్పు ఉందని.. బడ్జెట్ యేతర అప్పులు కలుపుకుంటే 6 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. అయినా కేసీఆర్ అప్పుల దాహం తీరడం లేదన్నారు.
111 జీవో రద్దుతో హైదరాబాద్ కు ముప్పు వాటిల్లిందన్నారు కిషన్ రెడ్డి. మాట తప్పితే తల నరుక్కుంటానన్న కేసీఆర్.. కొన్ని వేల సార్లు తల నరుక్కోవాల్సి వచ్చేదన్నారు. పార్టీ ఆఫీసులకు కేసీఆర్ స్థలం ఇస్తారు కానీ పేదలకు ఇవ్వడం లేదన్నారు. పార్టీ ఆఫీసుల పేరుతో కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాల భూమి కేటాయించారు కానీ.. దళితలకు మూడెకరాలు ఇవ్వడం లేదన్నారు.