29న రాష్ట్రానికి కేంద్రమంత్రి నితి గడ్కరీ

29న రాష్ట్రానికి కేంద్రమంత్రి నితి గడ్కరీ
  • రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న నేషనల్ హైవేలకు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి 
  • కార్యక్రమానికి రాష్ట్ర సర్కార్ ను ఆహ్వానించొద్దని నిర్ణయం! 
  • ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో సీరియస్ 

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 29న హైదరాబాద్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న నేషనల్ హైవేలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర సర్కార్ ను ఆహ్వానించొద్దని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రోగ్రామ్ కోసం తేదీలు ఖరారు చేయాలని గత కొన్ని నెలలుగా కేంద్ర మంత్రి కార్యాలయం రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నప్పటికీ, ఇక్కడి అధికారుల నుంచి స్పందన లేకుండా పోయింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న గడ్కరీ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హైదరాబాద్ టూర్ ఖరారు చేసుకున్నారు. శంషాబాద్ లోని జీఎంఆర్ హెరీనా హోటల్ ఆవరణలోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రమే పాల్గొననున్నారు. 

10 వేల మందితో బీజేపీ సభ.. 

శంకుస్థాపన కార్యక్రమం తర్వాత, దానికి దగ్గర్లోనే 10 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జన సమీకరణ బాధ్యతలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు అప్పగించింది. జీహెచ్ఎంసీలోని 47 మంది బీజేపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరు కనీసం వంద మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని సిటీ బీజేపీ నిర్ణయించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల కార్పొరేటర్లతో సమావేశమై జన సమీకరణపై చర్చించారు.