- కృష్ణా ప్రాజెక్టుల విద్యుత్ కేంద్రాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి
- వీలైనంత తొందరగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
- కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా ప్రాజెక్టులపై ఉన్న పవర్హౌస్లను బోర్డుకు ఎందుకు అప్పగించలేదని, గెజిట్ అమలు ఎంతదాకా వచ్చిందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఆయన గెజిట్ అమలుపై కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్, బోర్డుల మెంబర్ సెక్రటరీలు డీఎం రాయ్పురే, బీపీ పాండేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఫుల్ బోర్డు సమావేశాలు, సబ్ కమిటీ సమావేశాల్లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలపై చైర్మన్లు వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ను తేల్చకుండా ఔట్లెట్లను ఇచ్చేందుకు తెలంగాణ ఒప్పుకోవట్లేదని తెలిపారు. గోదావరిపై ఒక్క పెద్దవాగు ప్రాజెక్టును ఇచ్చేందుకు మాత్రమే రెండు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. అయితే, తెలంగాణలోని అన్ని ఔట్లెట్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఏపీ కోరుతోందని, కానీ, తెలంగాణ మాత్రం ఒప్పుకోవట్లేదని వివరించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని ఇచ్చేందుకు ఏపీ జీవో ఇచ్చినా.. లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ను స్వాధీనం చేసుకున్నాకే తమ పవర్ హౌస్నూ తీసుకోవాలంటూ మెలిక పెట్టిందని చెప్పారు. శ్రీశైలంతో పాటు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల పవర్హౌస్ల స్వాధీనంపై తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్కు లేఖ రాశామని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన జలశక్తి శాఖ కార్యదర్శి.. బోర్డుల పరిధి ఇప్పటికే అమల్లోకి వచ్చేసిందని, వీలైనంత తొందరగా ప్రాజెక్టుల ఔట్లెట్లు, పవర్హౌస్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.