ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు చాలా తేలికగా, ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు ప్రతి దుకాణంలో దొరుకుతాయి. అందుకే చాలామంది దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వాటినే కొనుక్కొని తాగుతుంటారు. కొందరైతే ఆ సింగిల్ యూజ్ బాటిళ్లనే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. కానీ.. అలాంటి వాటిలో నీళ్లు తాగడమంటే ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకోవడమే అంటున్నారు సైంటిస్ట్లు. ఎందుకంటే..
ప్లాస్టిక్ని అతిగా వాడడం, ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్ట్లు ఎప్పటినుంచో చెప్తున్నారు. అయితే, ఇప్పుడు పంజాబ్లోని మొహాలీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎన్ఎస్టీ) దీనిపై ఒక రీసెర్చ్ చేసింది. అందులో సింగిల్ యూజ్ పాలీథిలిన్ టెరెఫ్తాలేట్(పీఈటీ) బాటిళ్లలో నీళ్లు తాగితే.. వాటి నుంచి వచ్చే నానోప్లాస్టిక్లు గట్ బాక్టీరియాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, కణాల్లో టాక్సిన్స్ని పెంచుతాయని తేలింది.
రోగ నిరోధక శక్తిపై..
దీర్ఘకాలికంగా ఈ నానోప్లాస్టిక్లు కడుపులో చేరితో జీర్ణవ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. కొన్నాళ్లకు యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ తగ్గుతుంది. అంతటితో ఆగకుండా ఈ నానో ప్లాస్టిక్లు మెటబాలిజంతోపాటు డీఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ లాంటి సమస్యలకు పునాదులు వేస్తాయని ఈ పరిశోధనలో తేలింది. అంతేకాదు.. నానోప్లాస్టిక్స్ గట్ మైక్రోబయోమ్ను మార్చి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తంపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. ఇవి ఎర్ర రక్తకణాల మెంబ్రేన్ను దెబ్బతీస్తాయి. ఇంటెస్టైనల్ బారియర్ను దాటి రక్తంలోకి చొచ్చుకుపోతూ, ఊపిరితిత్తులు, రిప్రొడక్టివ్ సిస్టమ్ను కూడా ప్రభావితం చేస్తాయి. మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ కదలిక, టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతాయి. ఆడవాళ్లలో అండాశయాల్లో ఫోలికల్స్ సంఖ్య తగ్గుతుంది. మెదడులోకి చొచ్చుకుపోయి న్యూరో ఇన్ఫ్లమేషన్ (మెదడులో మంట), అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులను కలిగించే ప్రమాదం కూడా ఉందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి.
బాటిళ్లలోకి ఎలా..
1– 5 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్లు అంటాం. వాటి కంటే చిన్నగా ఉండేవాటిని నానోప్లాస్టిక్లు అంటారు. ఇవి 1 మైక్రోమీటర్ కంటే చిన్నగా అంటే - 1/1000 మిల్లీమీటర్ కంటే చిన్నగా ఉంటాయి. సాధారణంగా ప్లాస్టిక్స్ ఎండ, బలమైన గాలులు తగిలినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. చివరికి మైక్రోప్లాస్టిక్లు, నానోప్లాస్టిక్లుగా మారుతాయి.
మరి ఇవి బాటిళ్లలోకి ఎలా చేరుతాయి అంటే.. బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడినప్పుడు, బలంగా షేక్ చేసినప్పుడు లేదంటే పాతబడిన బాటిల్ గోడల నుంచి నానో ప్లాస్టిక్స్ నీళ్లలో కలుస్తాయి. ముఖ్యంగా బాటిల్ను 40 నుంచి 60 డిగ్రీల మధ్య వేడిలో ఉంచినప్పుడు, వేడి నీళ్లు పోసినప్పుడు నానోప్లాస్టిక్స్ విడుదల మొదలవుతుంది. నిమ్మకాయ నీళ్లు, సోడా, ఫ్లేవర్డ్ వాటర్ లాంటివి పోసినప్పుడు, నీళ్లను ఎక్కువ రోజులు బాటిళ్లలో నిల్వ ఉంచినప్పుడు కూడా ఇవి విడుదల అవుతాయి.
మన దేశంలో..
ప్లాస్టిక్ వాడకంపై మన దేశంలో కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ చాలామంది వాటిని పెద్దగా పాటించడం లేదు. కేంద్రం 2022 జులైలో స్ట్రాలు, ఇయర్బడ్స్ లాంటి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ) వస్తువులపై నిషేధం విధించింది. కానీ.. పీఈటీ బాటిల్స్ మీద పూర్తి ఆంక్షలు లేవు. ఇప్పుడు విడుదలైన ఈ స్టడీ రిపోర్ట్స్ పీటీటీ బాటిల్స్పై నిషేధాన్ని తప్పనిసరి చేయాలి అనేలా ఉన్నాయి.
లీటర్ నీళ్లలో..
నానోప్లాస్టిక్లు చాలా చిన్నవి. వాటిని అంత ఈజీగా గుర్తించలేము. అయితే, మానవులతో సహా 1,500 కంటే ఎక్కువ జీవ జాతులు ఈ ప్లాస్టిక్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా నానోప్లాస్టిక్లు మహాసముద్రాలు, నదులు, అంటార్కిటిక్ మంచు, ఫుడ్, బాటిళ్లలో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కొలంబియా యూనివర్సిటీ పోయినేడు చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక లీటర్ వాటర్ బాటిల్లో లక్షా పది వేల నుంచి 3 లక్షల 70 వేల పాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి. వాటిలో 90 శాతం నానోప్లాస్టిక్స్, మిగిలినవి మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మన రక్తంలో సగటున లీటరుకు 1-7 మైక్రోగ్రామ్ నానో/మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టు కొన్ని స్టడీల్లో తేలింది. మెదడు టిష్యూలో కూడా వీటిని కనుగొన్నారు.
ఏం చేయాలి?
కేవలం పీఈటీ వాటర్ బాటిళ్లను వాడడం మానేస్తే నానోప్లాస్టిక్స్ నుంచి పూర్తిగా తప్పించుకున్నట్టే అనుకోవద్దు. ఎందుకంటే అవి గాలి, నీరు, ఆహారం... ఇలా అనేక రకాలుగా శరీరంలోకి చేరుతున్నాయి. కాబట్టి వాటి ఎక్స్పోజర్ను తగ్గించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
►ALSO READ | ఆధ్యాత్మికం: ధర్మబద్ధమైన ఆహారం ... మంచి ఆలోచనలను ఇస్తుంది
పీఈటీ బాటిళ్లలో నీళ్లు తాగడం పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా వేడి ప్రదేశంలో, ఎండలో పెట్టిన బాటిళ్లలో నీళ్లు అస్సలు తాగొద్దు. ట్యాప్ వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకుని తాగాలి. గ్లాస్ బాటిల్స్, రీసైకిలబుల్ మెటీరియల్స్తో తయారుచేసిన బాటిళ్లను వాడాలి.
ఫుడ్ని ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి చేయొద్దు. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ బాక్స్లు పెడితే 3 నిమిషాల్లో మిలియన్ల కొద్దీ నానోప్లాస్టిక్స్ విడుదల అవుతాయి. గ్లాస్ లేదా స్టీల్ కంటైనర్లు వాడడం మంచిది.
ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ తక్కువ తినాలి. ఫ్యాటీ ఫుడ్స్లో నానోప్లాస్టిక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెజిటేరియన్ ఫుడ్లో తక్కువగా ఉంటాయి. కూరగాయలు కోయడానికి వుడెన్ లేదా గ్లాస్ కటింగ్ బోర్డ్స్ వాడాలి. ప్లాస్టిక్ బోర్డ్స్ ద్వారా నానోప్లాస్టిక్స్ ఫుడ్లోకి చేరుతాయి.సింథటిక్ ఫైబర్ బట్టలు తక్కువగా వాడాలి. పాలిస్టర్, నైలాన్ లాంటి బట్టలు ఉతికినప్పుడు నానోప్లాస్టిక్స్ ఎక్కువగా విడుదలవుతాయి. అందుకే కాటన్, వూల్ బట్టలు బెటర్.ఇంట్లో ఉండే డస్ట్లో కూడా నానోప్లాస్టిక్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ మాపింగ్ చేయాలి. మైక్రోబీడ్స్ ఉండే ఫేస్ వాష్, టూత్పేస్ట్కు బదులు నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. కొన్ని రకాల సముద్రపు చేపల్లో నానోప్లాస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటివాటిని తక్కువగా తినాలి.
