వీడియో: పట్ట పగలు.. ప్రభుత్వ ఆఫీసులోనే దర్జాగా మందుకొడుతున్న ఉద్యోగి

వీడియో:  పట్ట పగలు.. ప్రభుత్వ ఆఫీసులోనే దర్జాగా మందుకొడుతున్న ఉద్యోగి

ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక వరం. స్థిరమైన పని వేళలు, లెక్కలేనన్ని సెలవులు.. వీటితో పాటు నెల గడిచేసరికి చేతిలో జీతం. అప్పుడప్పుడు బోనస్‌లు. అబ్బో ఈ ఉద్యోగాలకు.. ఈ ఉద్యోగం ఉన్న యువతీయువకులకు ఉన్న డిమాండే వేరు. వీరిని మనువాడేందుకు తెగ ఎగబడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రవర్తిస్తున్న తీరు.. మిగిలిన వారికి కూడా మాయని మచ్చని మిగిల్చుతోంది. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి.. విధీ నిర్వహణలోనే మందు కొట్టాడు. అదీ కూడా కార్యాలయంలోనే దర్జాగా పెగ్గు మీద పెగ్గులు వేశాడు.    

ఉత్తరప్రదేశ్‌, స్వైజ్‌పూర్‌లోని రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి.. కార్యాలయంలోనే మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సదరు అధికారిని కపూర్ సింగ్‌గా గుర్తించారు. వీడియోలో సదరు ఉద్యోగి చేతిలో డ్రింక్ గ్లాసు పట్టుకుని ఉండటం మనం చూడవచ్చు. ఒక చేతిలో ఫోన్‌, మరో చేతిలో మద్యం పట్టుకుని కనిపిస్తున్నాడు. అతని ముందున్న డెస్క్‌పై  అధికారిక ఫైల్‌లు, పత్రాలు కనిపిస్తున్నాయి. అతనికి మద్యం అలవాటు ఉండటం తప్పు కాకపోయినా..అధికారిక ప్రాంగణంలో మద్యం సేవించటం చర్చకు దారితీస్తోంది.

ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు అధికమవుతున్నాయి. గత నెలలో హోషియార్‌పూర్‌లోని సెంట్రల్ జైలు అంబులెన్స్‌లో పంజాబ్ పోలీసులు మద్యం సేవిస్తూ కనిపించారు. యూనిఫారం ధరించిన పోలీసులు వాహనంలో కూర్చుని ఖైదీతో పాటు దర్జాగా మద్యం సేవించారు. ఇలా బయట ప్రపంచానికి పట్టుపడుతున్న మందుబాబులు కొందరే కానీ.. కార్యాలయంలోనే మద్యం సేవిస్తున్న వారు ఎందరో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.