మీ పిల్లలకు మార్కులు కావాలంటే.. ఓటేయండి

మీ పిల్లలకు మార్కులు కావాలంటే.. ఓటేయండి

దేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్ని ఏండ్లలో ఎన్నో మార్పులొచ్చినా.. ఓటు వేయడంలో మాత్రం జనాలలో మార్పులు రావడంలేదు. ఎలక్షన్ డే అంటే.. హాలిడేలాగా ఫీలవుతున్నారు. ఓటు వేయడం కోసం సెలవు ఇచ్చినా.. ఓటు వేయడానికి మాత్రం ముందుకురారు. దాంతో ఓటింగ్ శాతం సగాని కన్నా ఎక్కువ నమోదుకావడంలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ఓ కాలేజీ యాజమాన్యం ఓటింగ్ శాతం పెంచడం కోసం వినూత్నంగా ఆలోచించింది. 

ప్రస్తుతం యూపీలో విడతలవారీగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఓటింగ్ శాతం పెరగడంలేదు. దాంతో ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే.. వారి పిల్లలకు 10 మార్కులు బహుమతిగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ..  ఈ ఆలోచన ఓటర్ల సంఖ్యను పెంచడంతోపాటు బలహీన విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 

‘ఫిబ్రవరి 23 నుంచి జరిగే నాలుగో దశ ఎన్నికలతో పాటు మిగతా విడతల్లో కూడా తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొంటే.. వారి పిల్లలకు మేం 10 మార్కులను రివార్డ్ చేస్తాం. దీని ద్వారా ఓటర్లను 100 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతేకాకుండా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు కూడా ఈ విధానం దోహదపడుతుంది’ అని రాకేష్ కుమార్ చెప్పారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాలుగో దశ ఎన్నికలు బుధవారం (ఫిబ్రవరి 23) కొనసాగుతున్నాయి. ఏడో దశ పోలింగ్ మార్చి 7న నిర్వహించనున్నారు. అనంతరం మార్చి 10న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

For More News..

ఇటుక బట్టీలో కోటి రూపాయల డైమండ్

సినీ ఇండస్ట్రీలో మరో మరణం