ఢిల్లీ/బిజ్నోర్: అదనపు కట్నం కోసం వేధించాడు.. ఆడపిల్లలు పుట్టారని కొట్టాడు.. ఎనిమిదేండ్లు భరిం చింది.. కన్నీళ్లు దిగమింగుకుని కాపురం చేసింది.. కానీ భర్త పైశాచికత్వం అంతకంతకూ పెరిగిపోయింది.. బాధలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. ‘‘నాన్నా. నేను చనిపోతున్నా. నన్ను క్షమించు’’ అని వీడియో మెసేజ్ పెట్టి 30 ఏండ్ల మన్దీప్ కౌర్ తనువు చాలించింది. అమెరికాలోని న్యూయార్క్ రిచ్మండ్హిల్లో నాలుగు రోజుల కిందట జరిగిందీ ఘటన. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు చెందిన మన్దీప్ కౌర్కు రంజోధ్బీర్ సింగ్ సంధుతో 2015లో పెండ్లి జరిగింది. అప్పటి నుంచి అతడి వేధింపులు మొదలయ్యాయి. తర్వాత దంపతులు అమెరికా వెళ్లిపోయారు. అక్కడ అవి ఇంకా పెరిగిపోయాయి. ఇద్దరు అమ్మాయిలే పుట్టడంతో కౌర్ను భర్త వేధించేవాడు.
ఇక దెబ్బలు తినలేను..
మన్దీప్ కౌర్ చనిపోవడానికి ముందు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ‘‘అన్నింటినీ భరించా. ఏదో ఒకరోజు అతడు మారుతాడని ఆశించా. ఎనిమిదేండ్లు అయింది. ఇకపై దెబ్బలు తినలేను. ఆత్మహత్య చేసుకోవాలని నా భర్త, అత్తమామలు నన్ను వేధిస్తున్నారు. నాన్నా. నేను చనిపోతున్నా. దయచేసి నన్ను క్షమించండి” అని కన్నీళ్లు పెట్టుకుంది.‘‘నన్ను ఐదు రోజుల పాటు ట్రక్కులో బందీగా ఉంచాడు. నన్ను హింసించిన వీడియోలను మా వాళ్లకు పంపాడు. మా నాన్న పోలీసు కేసు పెట్టారు. కానీ రక్షించమని వేడుకోవడంతో నేనే కాపాడా. అయినా అతడు మారలేదు” అని చెప్పుకొచ్చింది. తర్వాత ఆత్యహత్య చేసుకుని చనిపోయింది. ఏదో ఒకరోజు అంతా సర్దుకుంటుందని భావించామే తప్ప ఇలా జరుగుతుందని అనుకోలేదని మన్దీప్ కౌర్ ఫ్యామిలీ ఆవేదన వ్యక్తంచేసింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
వీడియోలు వైరల్
మన్దీప్ను రంజోధ్బీర్ హింసిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మన్దీప్ తన ఫ్రెండ్స్కు పంపగా, వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పలువురు రిచ్మండ్లోని మన్దీప్ ఇంటిముందు నిరసనలు తెలిపారు. పలు దేశాల్లో ఉంటున్న సిక్కులు.. జస్టిస్ ఫర్ మన్దీప్ హాష్ ట్యాగ్తో పోస్టులు పెడుతున్నారు.