బందీలైన భారతీయ విద్యార్థులను ఆదుకుంటాం

బందీలైన భారతీయ విద్యార్థులను ఆదుకుంటాం

బందీలైన భారతీయ విద్యార్థులను ఆదుకుంటాం : విదేశాంగ శాఖ

ఢిల్లీ : వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో అరెస్టైన భారతీయులను ఆదుకుంటామని భారత విదేశాంగ శాఖ భరోసా ఇచ్చింది. ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంతో చేస్తున్న సంప్రదింపుల వివరాలను తెలిపింది. న్యూ ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీకి.. విదేశాంగ శాఖ విధానపరమైన ఓ ప్రణాళికను రూపొందించి ఇచ్చామని వివరించింది.

అమెరికాలో బందీలుగా ఉన్న వారి ఆత్మగౌరవం కాపాడటమే తమ ప్రధాన ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారతీయ విద్యార్థులను ఏమార్చి ఈ కుట్రలోకి కొందరు లాగారని… వారిని నేరస్తులన్న కోణంలో చూడొద్దని కోరామని తెలిపింది.

“అరెస్టైన విద్యార్థుల పూర్తి వివరాలు… వారి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించాలని అమెరికాను కోరాం. వారి ఇష్టానికి వ్యతిరేకంగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవద్దని కోరాం. ఈ అంశంపై ఏర్పాటైన ప్రత్యేక భారతీయ అధికార బృందం, రాయబారులు యూఎస్ లోని పలు డిటెన్షన్ సెంటర్లకు వెళ్లారు. బందీలుగా ఉన్నవారికి దౌత్యపరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు” అని వివరించారు.

ఇప్పటివరకు 30మంది భారతీయ విద్యార్థులను భారత రాయబారులు కాంటాక్ట్ అయ్యారని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. మిగతా అందరు భారతీయ విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

ఇండియా అధికారులు, రాయబారుల బృందం.. అమెరికాలోని భారతీయ ప్రతినిధులు, వారి అసోసియేషన్లతో టచ్ లో ఉన్నారనీ.. బందీలుగా ఉన్న వారి పూర్తి వివరాలు తెల్సుకుంటున్నామని విదేశాంగ శాఖ వివరించింది.

వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీలో 24/7 పనిచేసే హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు అధికారులు. +1-202-322-1190 మరియు  +1-202-340-2590 email : cons3.washington@mea.gov.in నంబర్లను, ఈమెయిల్ ను ఎవరైనా సంప్రదించవచ్చని చెప్పారు.

భారతీయ అధికారులు, రాయబారుల బృందం, అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ… బాధితులకు న్యాయపరమైన సహాయం, సూచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

బందీలుగా ఉన్న విద్యార్థులను క్షేమంగా విడిపించే అంశానికి భారత ప్రభుత్వం, యూఎస్ లోని భారత ఎంబసీ, రాయబారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.

వీసా రూల్స్ ను ఉల్లంఘించి అమెరికాలోనే ఉండేందుకు డెట్రాయిట్ లోని ఫార్మింగ్ టన్ యూనివర్సిటీలో చేరారు కొందరు విద్యార్థులు. ఈ కుట్రలో భాగస్వాములైన 2వందల మంది విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూజెర్సీ, అట్లాంటా, హ్యూస్టన్, మిషిగాన్, కాలిఫోర్నియా, లూసియానా, నార్త్ కరోలినా, మిస్సోరి రాష్ట్రాల్లో దాడులు చేసి వీరిని అరెస్ట్ చేశారు. వివిధ డిటెన్షన్ సెంటర్లలో వీరిని బందీలుగా ఉంచారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 8మంది ఉన్నారు.