UPI లావాదేవీల ఛార్జీలపై.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థికశాఖ

UPI లావాదేవీల ఛార్జీలపై.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్థికశాఖ

UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తున్నట్లు బుధవారం ఉదయం నుంచి ప్రచారం జోరుగా సాగింది. UPI ద్వారా రూ.3వేల కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే  మర్చంట్ డిస్కౌంట్ రేటు( MDR) ఛార్జీలు విధిస్తున్నట్లు సోషల్ మీడియా, వార్తా వెబ్ సైట్లలో వచ్చిన కథనాలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆన్ లైన్ ఊహాగానాలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ  పుకార్లు నమ్మొద్దని స్పష్టం చేసింది ఆర్థికశాఖ. 

బుధవారం (జూన్11) ఉదయం నుంచి UPI లావాదేవీలపై ప్రభుత్వం MDR ఛార్జీలు వసూలు చేయనుందని ఆన్ లైన్ లో ప్రచారం జరిగింది. ఇలాంటి నిరాధారమైన ప్రచారం ప్రజల్లో అనవసరమైన గందరగోళం, భయం, అనుమానాలను కలిగిస్తుందని, ఎవరూ ఇలాంటి పుకార్లు నమ్మొద్దని  ఓ ప్రకటనంలో స్పష్టం చేసింది కేంద్ర ఆర్థికశాఖ.  

మరోవైపు మేనెల యూపీఐ లావాదేవీల వివరాలను తెలిపింది ఆర్థిక శాఖ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) నిర్వహించే UPI ద్వారా మే నెల 18.86 బిలియన్ల లావాదేవీలు ప్రాసెస్ అయ్యాయి. ఇది ఏప్రిల్ కంటే ఎక్కువ. ఏప్రిల్‌లో UPI 17.89 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. పేమెంట్స్ సర్వీస్ కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ మార్చిలో 18.30 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. UPI ద్వారా మే నెలలో మొత్తం రూ.25.14 లక్షల కోట్లు, ఏప్రిల్‌లో రూ.23.95 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని NPCI రిలీజ్ చేసింది. 

గత ఏడాది మేనెలలో జరిగిన 14.03 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఈ ఏడాది మేనెల లావాదేవీలు 33శాతం పెరిగాయి. మే నెలలో సగటు రోజువారీ లావాదేవీల మొత్తం రూ. 81వేల106 కోట్లుగా కాగా..సగటు రోజువారీ లావాదేవీల పరిమాణం 602 మిలియన్లు.

2016లో ప్రారంభించినప్పటినుంచి UPI వేగంగా అభివృద్ధి చెందింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, Google Pay, PhonePe ,Paytm వంటి ప్రైవేట్ కంపెనీల ప్రవేశం మొత్తంగా UPI లావాదేవీలను గణనీయంగా పెంచాయి.