- విమానాల విడిభాగాలకు ‘మేడిన్ తెలంగాణ’ ట్యాగ్
- సాఫ్రాన్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్లాంటి సంస్థల ప్లాంట్లతో గ్లోబల్ గుర్తింపు
- డీఆర్డీవోలాంటి సంస్థలతో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీకి హైదరాబాద్ అత్యంత అనుకూలమని వెల్లడి
- ‘ఏరోమార్ట్ హైదరాబాద్ 2026’ సదస్సులో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలు.. తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ను మొదలుపెట్టాలని ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. . అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ను రాష్ట్రంలోని టాటా సకోర్స్కీ ఏరోస్పేస్ తయారు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, విధానపరమైన మద్దతు, ప్రతిభ కలిగిన యువత, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలనతో తెలంగాణ ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారిందని చెప్పారు.
భవిష్యత్ ఏరోస్పేస్ ఉత్పత్తులన్నీ తెలంగాణ నుంచే వస్తాయని తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘ఏరోమార్ట్ హైదరాబాద్ 2026’ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కన్వెన్షన్లో ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సుకు 25 దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో 3 కొత్త ఎయిర్పోర్టులను నిర్మిస్తామని తెలిపారు. ఏరోస్పేస్మాన్యుఫ్యాక్చరింగ్లో రెండున్నరేండ్లుగా తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించి గ్లోబల్హబ్గా అవతరించిందని చెప్పారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జపాన్, ఇజ్రాయెల్, కెనడాలాంటి దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తు చేశారు. అపాచీ హెలికాప్టర్ల ఫ్యూజ్లేస్లను బోయింగ్, ఎఫ్16 యుద్ధవిమానాల రెక్కలను లాక్హీడ్ మార్టిన్లు ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పారు. సాఫ్రాన్ సంస్థ కాంప్లెక్స్ ఏరో ఇంజిన్ కాంపోనెంట్స్, ఎమ్మార్వో సిస్టమ్స్ను డెవలప్ చేస్తున్నదని వివరించారు. జీఈ ఏరోస్పేస్, హనీవెల్ సంస్థలు కూడా ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు.
ప్రపంచంలోని అత్యాధునికమైన విమానాల్లోని విడిభాగాలు ఇప్పుడు మేడిన్ తెలంగాణ ట్యాగ్తో తయారవుతున్నాయని తెలిపారు. గత నెలలోనే స్పెయిన్కు చెందిన ఐటీపీ ఏరో సంస్థ.. మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో కేవలం ఎఫ్టీజీ ఏరోస్పేస్ అనే సంస్థనే మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిందని తెలిపారు.
ఏరోస్పేస్ ఎకనామిక్ జోన్
రాష్ట్రంలో ఏరోస్పేస్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్)ను ఏర్పాటు చేసి పటిష్టమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను బలపేతం చేశామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ ఇండస్ట్రీస్కు 1500 ఎంఎస్ఎంఈలు కాంపోనెంట్లను తయారుచేసి ఇస్తున్నాయన్నారు. కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డీఆర్డీడీవో, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, రీసెర్చ్ సంస్థలు, ప్రైవేట్ ఇండస్ట్రీలతో హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్ల మాన్యుఫ్యాక్చరింగ్కు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారిందని చెప్పారు.
దాంతోపాటే రాష్ట్రంలో అత్యంత నైపుణ్యం కలిగిన యువతకూ కొదవలేదన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుతో ప్రతిభ కలిగిన యువత ఎంతో మంది వస్తున్నారని చెప్పారు. దీంతో గత కొన్నేండ్ల నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీ వృద్ధి 30 శాతంగా ఉందని తెలిపారు. నిరుడు తొలిసారిగా ఫార్మా ఎగుమతులను దాటి అధికంగా ఏరోస్పేస్ ఎగుమతులే ఎక్కువగా జరిగాయన్నారు. 103 శాతం వృద్ధి సాధించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే మూడు కొత్త ఎయిర్పోర్టులతో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్వో) ఆపరేషన్లలో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
