వాషింగ్టన్: అమెరికా, వెనెజువెలా దేశాల మధ్య అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చమురు నిల్వలున్న వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ అమెరికా ఆధిపత్యంలోకి రానుంది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఆయిల్ డీల్ అని అన్నారు. కుదిరిన ఒప్పందం ప్రకారం వెనెజువెలాలోని 17 ఆయిల్ ఫీల్స్డ్ అభివృద్ధి చేసేందుకు ఆ దేశంలో అమెరికా కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఆయిల్లో 55 శాతం అమెరికాకే చెందుతుందని ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా అసలు ధరకే చమురును కొనుగోలు చేసే హక్కు కూడా అమెరికాకు ఉండనుందని తెలిపారు. దీంతో యూఎస్కు చమురు సప్లయ్ పెరుగుతుందని, దేశానికి కావాల్సిన వ్యూహాత్మక చమురు నిల్వలు తిరిగి పుంజుకునే చాన్స్ ఉంటుందని ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
వెనెజువెలాకు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న వెనెజువెలా చమురు పరిశ్రమకు ఈ డీల్ కొత్త ఊపిరి పోయనుంది. ఒప్పందం ద్వారా రూ.9.5 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు వస్తాయని వెనెజువెలా ప్రభుత్వం అంచనావేస్తోంది. పన్నుల ద్వారానే దేశానికి రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని చెప్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికాతో జరిగిన ఈ ఒప్పందం ఎంతో కీలకమని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ పేర్కొన్నారు.
100 ఏండ్లు హక్కులు
డీల్ ప్రకారం అమెరికా ఆధ్వర్యంలో నడిచే ప్రైవేటు కంపెనీకి 100 ఏండ్ల పాటు వెనెజువెలాలోని ఆయిల్ ఫీల్డ్స్ను అభివృద్ధి చేసే హక్కులు లభిస్తాయని అమెరికా అధికారులు తెలిపారు. తాజా ఒప్పందం రెండు దేశాలకు పెద్ద విజయమని యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. వెనెజువెలాకు పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని, అమెరికాకు తక్కువ రేటుకే గ్యాస్ దొరికే అవకాశం ఉంటుందని అన్నారు.
