
- తైవాన్ జలసంధిలోకి అమెరికా యుద్ధనౌకలు
- స్వేచ్ఛాయుత వాతావరణం కోసమేనన్న యూఎస్
- రెచ్చగొడితే దీటుగా స్పందిస్తమన్న చైనా
వాషింగ్టన్: అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలు ఆదివారం తైవాన్ జలసంధి గుండా వెళ్లాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం కోసమే తమ యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి ద్వారా ప్రయాణించాయని అమెరికా ఓ ప్రకటనలో తెలిపింది. యూఎస్ఎస్ ఆంటియోటమ్, యూఎస్ఎస్ చాన్స్ లర్స్విల్లే అనే యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి ద్వారా వెళ్లాయని పేర్కొంది. ఆ నౌకలు ప్రయాణించిన ప్రాంతం ఏ దేశ సముద్ర జలాల పరిధిలోకి రావని అమెరికా చెప్పుకొన్నది. తైవాన్లో పెలోసీ పర్యటనను సాకుగా చూపుతూ తైవాన్జలసంధిలో చైనా మిలటరీ డ్రిల్స్చేసి ఆ ప్రాంతంలో శాంతికి భంగం కలిగించిందని, చైనా అలా మిలటరీ డ్రిల్స్చేస్తూ శాంతికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికా తేల్చిచెప్పింది. అమెరికా నౌకలు తమ జలసంధిలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్లాయని తైవాన్ తెలిపింది.
యూఎస్ నేవీ కదలికలను గమనిస్తున్నాం: చైనా
తైవాన్జలసంధి గుండా వెళ్లిన అమెరికా యుద్ధ నౌకలను గమనిస్తున్నామని చైనా తెలిపింది. అమెరికా తీరుతో అలర్ట్ అయ్యామని, తమను రెచ్చగొడితే దీటుగా స్పందిస్తామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
చైనా తీరుపై ఇండియా ఆందోళన
తైవాన్ జలసంధిలో చైనా మిలటరీ డ్రిల్స్ చేయడంపై ఇండియా మొదటిసారిగా ఆందోళన వ్యక్తం చేసింది. జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ మేరకు శ్రీలంకలో భారత హై కమిషన్ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో కూడా చైనా తీరుపై మన విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.