ఓ వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకు ఏకంగా కారులో వచ్చేసాడు. సాధారణంగా ఇండియా టు అమెరికా అంటే విమానంలోనే వెళ్లాలి. రోడ్ ట్రిప్తో అసాధ్యం. కానీ లఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి దాన్ని పాజిబుల్ చేసి చూపించాడు. కాకపోతే ఇంత పెద్ద ట్రిప్ చేయడంతో అతనికి తడిసి మోపెడైంది. ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి మరీ అమెరికా నుంచి ఇండియా వచ్చాడట.
23 దేశాలు.. 22వేల కి.మీ... 53 రోజులు
లఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి 53 రోజుల క్రితం తన టయోటా టకోమా కారులో అమెరికా నుంచి బయలుదేరాడు. అమెరికాలో డ్రైవర్గా పనిచేస్తున్న లఖ్విందర్.. 60 వేల డాలర్లతో టయోటా టకోమా కారును కొనుక్కున్నాడు. కాలిఫోర్నియాలోని తన ఇంటి నుంచి మొదలైన ట్రిప్ 23 దేశాలు తిరిగి .. 22వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి 53 రోజుల్లో ఇండియాకు చేరుకున్నాడు. ఇందుకు అతనికి అయిన ఖర్చు కోటి రూపాయలు. డ్రైవింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిట్లు కావాలి. వాటి కోసం పడిన కష్టం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నాడు. అయితే ఆయన 22వేల కిలోమీటర్లు కారులోనే ప్రయాణించలేదు. అమెరికా నుంచి లండన్కు ..ఆ తర్వాత లండన్ నుంచి పారిస్కు కారును ట్రైన్లో పంపించేసాడు.
మూడు దేశాల్లో నాలుగు జరిమానాలు
లఖ్వీందర్ సింగ్ అతని ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. సింగ్ దాదాపు 3 సంవత్సరాలుగా మొత్తం ట్రిప్ ప్లాన్ చేశాడు. ఇరాన్ వీసా ఆమోదం పొందడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. తన కారులో ఉపయోగిస్తున్న మ్యాప్లో కాశ్మీర్ భాగం కాదంటూ ఎవరో ఫిర్యాదు చేయడంతో పాకిస్థానీ వీసా పొందడంలో అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. సింగ్ ప్రతి దేశానికి సింగిల్ ఎంట్రీ వీసా తీసుకున్నాడు. ఇంకా ఈ పర్యటనలో సింగ్ తన కారును అతివేగంగా డ్రైవ్ చేసినందుకు నాలుగుసార్లు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి జరిమానా సెర్బియాలో, రెండు, మూడు జరిమానాలు టర్కీలో చెల్లించాడు. చివరి జరిమానాను పాకిస్తాన్ లో చెల్లించాడు. అందువల్ల అతను రోడ్డు మార్గంలో అమెరికాకు తిరిగి రాలేకపోయాడు. ఇప్పుడు, అతను తన కారును షిప్ లేదా విమానంలో పంపేందుకు ప్లాన్ చేస్తున్నాడు.