69 వేల కోట్ల అప్పు 3 లక్షల 12 వేల కోట్లకు పెరిగింది

69 వేల కోట్ల అప్పు 3 లక్షల 12 వేల కోట్లకు పెరిగింది

తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69 వేల కోట్లు ఉంటే..2022 నాటికి  రూ.3 లక్షల12 వేల కోట్లకు చేరిందన్నారు. 2014లో ప్రతి మనిషి మీద 18 వేల అప్పు ఉంటే..2022 వచ్చే సరికి ప్రతి మనిషి తలసరి అప్పు లక్ష రపాయలు ఉందన్నారు.  కట్టిన ప్రాజెక్టులు కనపడటం లేదు కానీ అప్పులు పెరుగుతున్నాయన్నారు. కార్పొరేషన్ ద్వారా తీసుకునే అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు.  

పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ తో సమానంగా తెలంగాణ అప్పులున్నాయని తెలిపారు. జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితి ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తుందని విమర్శించారు.  రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావట్లేదన్నారు.  మహిళల పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించిన డబ్బులు విడుదల చేయట్లేదని విమర్శించారు. శ్రీలంక పరిస్థితులు భారత్ లో రాకూడదని విదేశాంగ మంత్రి హెచ్చరించారన్నారు. ఇష్టానుసారంగా అప్పులు చేయడం దేశానికి మంచిది కాదన్నారు.