- ఢిల్లీ మీటింగ్లోనూ కుదరని సయోధ్య
- తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కామెంట్
- సీనియర్లపై రాహుల్ గాంధీ సీరియస్
- క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కయ్యాలు ఆగడం లేదు. ‘అంతా బాగానే ఉన్నాం.. కలిసికట్టుగా ముందుకుపోతాం’ అని బయటకు చెప్తున్నా.. లోపల పాత గొడవలు రగులుతూనే ఉన్నట్టు కనిపిస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బహిరంగంగా ఆరోపణలు చేయడం, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో ఐక్యత గురించి మాట్లాడడం, పార్టీలో కోవర్టులున్నారంటూ సీతక్క కామెంట్ చేయడం, పార్టీ అన్నాక భేదాభిప్రాయాలు సహజమని పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అనడం ఆ పార్టీలోని నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరలేదని తేల్చి చెప్తున్నాయి. ఇది కాస్తా హైకమాండ్ వద్దకు చేరింది. ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో.. రేవంత్పై రాహుల్కు ఉత్తమ్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, రాహుల్ కూడా పార్టీలో గొడవలపై సీరియస్ అయ్యి, సీనియర్ లీడర్లను మందలించినట్టు తెలిసింది.
రేవంత్తో ఉత్తమ్కు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. హుజూర్నగర్ బైపోల్ టైమ్లోఉత్తమ్ తన భార్య పద్మావతికి టికెట్ ప్రకటించడం.. ఆ తర్వాత రేవంత్ మరో అభ్యర్థిని అనౌన్స్చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరాయి. దీనిపై అప్పట్లో పీఏసీ మీటింగ్లో రేవంత్పై ఉత్తమ్ అప్పటి పార్టీ రాష్ట్ర ఇన్చార్జికి ఫిర్యాదు కూడా చేశారు. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని గత నెల ఐదో తేదీన పోలీసులకూ కంప్లైంట్చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్పై దాడి చేశారు. ఉత్తమ్పై దుష్ప్రచారం అక్కడి నుంచే జరుగుతున్నట్టు గుర్తించామని, ఉత్తమ్ ఫిర్యాదు ఆధారంగానే సోదాలు చేసినట్టు చెప్పారు.
ఇది ప్రియాంకా గాంధీ సభకు రెండు మూడు రోజుల ముందే జరగడం గమనార్హం. దీంతో వివాదం మరింత తీవ్రమైంది. అయితే, నల్గొండలో నిరుద్యోగ నిరసన సభలో రేవంత్తో కలిసి సభలో పాల్గొన్న ఉత్తమ్.. తమలో విభేదాలేవీ లేవన్నారు. సరిగ్గా నెల తిరిగిందో లేదో.. ఆ మాటలు కూడా రివర్స్ అయిపోయాయి. తన మీదకు పార్టీలోని నేతతోనే ఎదురు దాడి చేయిస్తున్నారని, ఆ వ్యక్తికి ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారని రేవంత్పై డైరెక్ట్గా బాంబు పేల్చారాయన. రెండు రోజుల క్రితం సోనియా గాంధీకి, తాజాగా రాహుల్ గాంధీకి కూడా దీనిపై ఉత్తమ్ ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. తనపై రేవంత్ టీం దుష్ప్రచారం చేస్తున్నదని ఉత్తమ్ ఆధారాలను కూడా సమర్పించారని తెలుస్తున్నది.
పార్టీ మారుతారంటూ ప్రచారం
కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అధికార పార్టీ బీఆర్ఎస్లోకి జంప్అయ్యేందుకు సిద్ధమవుతున్నారని కొన్ని రోజులుగా కథనాలు ప్రసారమయ్యాయి. ఆ జాబితాలో పార్టీ సీనియర్ నేతలు జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే వారితో మాట్లాడారు. అయితే, తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వారు వాపోయారు. సోమవారం జరిగిన మీటింగ్లోనూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో ఇదే విషయం చెప్పారు.
జగ్గారెడ్డి కామెంట్లతో మరింత క్లారిటీ
పార్టీలో ఇంకా గొడవలు ఉన్నాయని చెప్పేందుకు ఎమ్మెల్యే జగ్గా రెడ్డి కామెంట్లు కూడా బలాన్ని చేకూర్చాయి. పార్టీలో అసలు ఐక్యత ఉందో లేదో తాను ఏమీ చెప్పలేనంటూ ఆయన కామెంట్ చేశారు. నాలుగేండ్లుగా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఎందుకో ఈ దరిద్రమని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారోనని అన్నారు. ఉత్తమ్ బరస్ట్ అవ్వడంలో బలమైన కారణమే ఉందని తేల్చి చెప్పారు. ఎవరితో మాట్లాడినా.. చెప్పుకున్నా పోయే సమస్య కాదన్నారు. అందుకే అన్ని విషయాలూ రాహుల్ కు చెప్తానన్నారు. ఢిల్లీకి వెళ్లిన జగ్గారెడ్డితో రాహుల్ గాంధీ కాసేపు ఒంటరిగా ముచ్చటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆయనతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీలోని విభేదాలు, పరిస్థితులను రాహుల్కు పూస గుచ్చినట్టు చెప్పినట్టు తెలుస్తున్నది.
సీనియర్లపై రాహుల్ సీరియస్
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ మీటింగ్లో సీనియర్ నేతలపై రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టు తెలిసింది. ఉత్తమ్ ఫిర్యాదుపై రేవంత్ను వివరణ కోరినట్టు సమాచారం. ఏమైనా విభేదాలుంటే లోలోపలే పరిష్కరించుకోవాలని, బయటపెట్టుకోవద్దని కాస్త కఠువుగానే చెప్పారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఏదైనా ఉంటే పార్టీ రాష్ట్ర ఇన్చార్జితో మాట్లాడాలని, లేదా తనతోనైనా నేరుగా మాట్లాడొచ్చని స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. ఇగోలకు పోయి పార్టీకి నష్టం చేయొద్దని హితవు చెప్పినట్టు తెలిసింది. నేతల సొంత నియోజకవర్గాల్లో పార్టీ ప్రోగ్రెస్ గురించి కూడా ఆరా తీసినట్టు తెలిసింది.