హుజూర్ నగర్, వెలుగు : హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్ది తమ అనుచరులను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని కాంగ్రెస్ అభ్యర్థి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ పోలీసుస్టేషన్ లో మంగళవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. పిటిషన్ ఇచ్చాక అక్కడే మీడియా తో ఉత్తమ్ మాట్లాడారు. విజయవాడకి చెందిన చాణక్య అనే సర్వే సంస్థతో తాము ఫీల్డ్వర్క్ చేయిస్తున్నామని, ఈ క్రమంలో సర్వే టీం వెంట ఉన్నవాళ్లను ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆయన గన్ మెన్ల సహాయంతో కిడ్నాప్ చేసి కారులో బలవంతంగా కోదాడ రోడ్ లోని ఓ కాలనీ కి తీసుకువెళ్లారని, తమకు అనుకూలంగా పనిచేయాలని లేదంటే చంపేస్తామని టీం సభ్యులను బెదిరించారని ఉత్తమ్ ఆరోపించారు.
వాళ్ల సెల్ఫోన్లు లాక్కొని టీంలో ఉన్న మహిళలతో దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయం సీఐకి తెలుసునని, ఆయన ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఎమ్మెల్యే గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఐ రామలింగారెడ్డి రెండున్నరేళ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని, గతంలో కూడా పలుమార్లు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వాపోయారు.
ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు, పోలీసుఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కాగా, సర్వే టీం సభ్యుడు బండి రామస్వామి నుంచి కంప్లయింట్ తీసుకొని విచారణ జరుపుతున్నామని సీఐ రామలింగారెడ్డి చెప్పారు.
