రెండేండ్లలో ఎస్ఎల్ బీసీని పూర్తిచేస్తం : మంత్రి ఉత్తమ్

రెండేండ్లలో ఎస్ఎల్ బీసీని పూర్తిచేస్తం : మంత్రి ఉత్తమ్
  • భవిష్యత్తు​లో టన్నెల్​ ప్రమాదాలు నివారించేందుకు పటిష్ట ప్రణాళిక: మంత్రి ఉత్తమ్
  • యుద్ధ విమానాలతో ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే 
  • ఇద్దరు ఆర్మీ అధికారుల డిప్యుటేషన్​కు రక్షణశాఖ అంగీకారం
  • నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కర్నల్​ పరీక్షిత్ మెహరా 
  • గౌరవ సలహాదారుగా జనరల్ హర్పాల్ సింగ్  
  • వీరిద్దరి సహకారంతో  అన్ని సొరంగాల నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి

న్యూ ఢిల్లీ, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ ఎల్ బీసీ) టన్నెల్ పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామని  ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్ ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్​కుమార్​రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిగిలిన ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పనుల రక్షణకు డిఫెన్స్​ శాఖ సహాయాన్ని కోరారు. 

అనంతరం తెలంగాణ భవన్ లోని శబరి బ్లాకులో ఉత్తమ్​కుమార్​రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మొత్తం 44 కిలో మీటర్ల ఎస్ఎల్ బీసీ సొరంగ మార్గంలో.. ఇప్పటికి 35 కిలో మీటర్లు పూర్తి చేసినట్టు తెలిపారు. మిగిలిన ఈ 9 కిలో మీటర్లు ఫారెస్ట్ ల్యాండ్ లో ఉందని చెప్పారు. ఈ ఫారెస్ట్ భూమిలో టన్నెల్ కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహాయం పై కేంద్ర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్నందున ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే (హెలికాప్టర్ సర్వే) చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

దీనికోసం ఆర్మీలో కర్నల్​పరీక్షిత్ మెహరా,  బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్(బీఆర్ఓ) మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్ ను డిప్యూటేషన్ పై తెలంగాణకు పంపేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పరీక్షిత్ మెహరా రెండేండ్లపాటు కొనసాగుతారని తెలిపారు.

ఆయన సేవలను ఎస్ఎల్ బీసీతోపాటు దేవాదుల, సీతారామ తదితర ప్రాజెక్టు పనుల్లో వినియోగించుకుంటామని వెల్లడించారు. అలాగే, జనరల్ హర్పాల్ సింగ్  గౌరవ సలహాదారుగా సేవలందించనున్నట్లు చెప్పారు. వీరిద్దరి సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన అన్ని సొరంగాల నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. 

డెన్మార్క్ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ 

డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పరికరాలు తీసుకువస్తామని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. హెలికాప్టర్​కు వీటిని అమర్చడం వల్ల 44  కిలో మీటర్లు మొత్తం సొరంగం పరిస్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.  ఈ సర్వే ద్వారా సొరంగం వాస్తవ పరిస్థితి అంచనా వేయొచ్చని అన్నారు. 9 కిలోమీటర్ల మేరకే సొరంగం పనులు పెండింగ్ లో ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 44 కిలోమీటర్లు సర్వే చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

44 కిలోమీటర్ల సొరంగం మధ్యలో గాలి కూడా చొరబడే అవకాశం లేకుండా ఉన్నదన్నారు. ఎన్టీఆర్ఐ నిపుణుడు ప్రొఫెసర్ తివారీ, ధన్​బాద్​లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు.  వచ్చే నెల 12 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, వారంలోగా పూర్తి చేస్తామని చెప్పారు.