- 11 జిల్లాల్లో 58 సీట్లకు పోలింగ్
- ఉత్తరప్రదేశ్లో ఇయ్యాల్నే ఫస్ట్ ఫేజ్ పోలింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో గురువారం ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగనుంది. యూపీలోని 58 నియోజక వర్గాల్లో 623 మంది పోటీ చేస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇయ్యాల(గురువారం) తొలి పరీక్ష జరగనుంది. మొత్తం ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో ఫస్ట్ ఫేజ్మొదలుకానుంది. యూపీలోని 58 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రూల్స్కు అనుగుణంగా బూత్ల దగ్గర ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి వరకు వర్చువల్గానే ప్రచారం నిర్వహించాయి. అతి తక్కువ మందితో ఇంటింటికీ వెళ్లి లీడర్లు ఓట్లడిగారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం వల్ల డబుల్ ఇంజన్ స్పీడ్తో అభివృద్ధి పనులు పూర్తిచేస్తున్నామని బీజేపీ ప్రచారం చేయగా.. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి లీడర్లు అఖిలేశ్, చౌదరిలతో పాటు బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఫోకస్ పెట్టగా.. తన హయాంలో లా అండ్ ఆర్డర్ను చాలా బాగా నిర్వహించానంటూ రాష్ట్ర ఓటర్లకు మాయావతి గుర్తుచేశారు. ఇంటింటి ప్రచారంపైనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఎక్కువ శ్రద్ధ పెట్టారు. దాదాపు అన్ని పార్టీలూ తమ మేనిఫెస్టోల్లో రైతులకు ఉచిత కరెంట్ కు చోటివ్వడంతో పాటు స్టూడెంట్లకు ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు, స్కూటీలు అందిస్తామంటూ హామీలను పొందుపరిచాయి. రాష్ట్ర ప్రజలు తమకే పట్టం కడతారంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా.. 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు జరగనున్న ఈ పోలింగ్లో మొత్తం 623 మంది బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
9 మంది మంత్రులు ..
శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గార్గ్, చౌదరి లక్ష్మీ నారాయణ్, అనిల్ శర్మ, జీఎస్ ధర్మేశ్, దినేశ్ ఖాతిక్.. ఆగ్రా రూరల్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్య పోటీ చేస్తున్నారు.
పోలింగ్ జరగనున్న జిల్లాలు..
షామిలి, హాపూర్, గౌతమ బుద్ధ నగర్, ముజఫర్నగర్, మీరట్, బాఘ్పత్, ఘజియాబాద్, బులంద్షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా
కిందటి ఎలక్షన్లో ఎవరికెన్ని?
2017 లో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 58 సీట్లలో 53 నియోజకవర్గాల్లో బీజేపీ కేండిడేట్లు గెలవగా.. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ చెరో రెండు స్థానాలను, రాష్ట్రీయ లోక్దళ్ ఒక సీటు గెల్చుకున్నాయి.