ఇల వైకుంఠపురం.. మంచు దుప్పటిలో బద్రీనాథ్ ఆలయం

ఇల వైకుంఠపురం.. మంచు దుప్పటిలో బద్రీనాథ్ ఆలయం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దిగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా అక్కడి కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఈ కారణంగా అక్కడి పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఆలి, హేమకుండ్ సాహిబ్ మంచు దుప్పటి పరుచుకొని కొత్త శోభను సంతరించుకున్నాయి.

శ్రీ మహావిష్ణువు మందిరధామం బద్రీనాథ్ .. ఈ మంచు దుప్పటితో ఆ వైకుంఠమే భూమిపై దిగివచ్చినట్టుగా ఉంది. ధవళ వర్ణంలో మెరిసిపోతూ.. మనస్సులను హత్తుకునేలా ఉంది. ముఖ్యంగా మందిరంపై గల ‘ఓం’ అనే బీజాక్షరంపై నుంచి జారుతున్న మంచు ఓ కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది.

పట్టణంలోని నివాస గృహాలు, చెట్లు, కొండలపై దట్టమైన మంచు పేరుకొని ఉండడంతో చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా, రమణీయంగా ఉంది. ప్రకృతి ప్రేమికులు ఈ సుందర దృశ్యాలను చూసేందుకు ముచ్చటపడుతున్నారు.