
- కరోనా నుంచి కోలుకున్నంక 9 నెలల తర్వాతే టీకా
- ప్రభుత్వ ప్యానెల్ సూచన
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకున్నంక వ్యాక్సిన్ తీసుకోవడానికి తొందరపడొద్దని ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ప్రజలకు సూచించింది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) పేర్కొంది. గతంలో ఇదే ప్యానెల్ వైరస్ నుంచి కోలుకున్నంక వ్యాక్సినేషన్కు ఆరు నెలల గ్యాప్ ఉండాలని చెప్పింది. తాజాగా ఈ గ్యాప్ను తొమ్మిది నెలలకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనివల్ల వ్యాక్సిన్ ప్రభావం మరింతగా పెరుగుతుందని చెప్పింది. దీంతో పాటు గర్భంతో ఉన్న వాళ్లు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని ప్యానెల్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పుడు అమలుచేస్తున్న ప్రొటోకాల్ ప్రకారం.. కరోనా బారినపడి కోలుకున్నోళ్లు వ్యాక్సినేషన్ కోసం నాలుగు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగాలి. ప్రెగ్నెంట్, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ వేయొద్దు. కరోనా వ్యాక్సిన్లను గర్భవతులు, పాలిచ్చే తల్లులపై పరీక్షించి చూడకపోవడంతో ప్రభుత్వం వారిని వ్యాక్సినేషన్కు దూరం పెట్టింది. కాగా, వ్యాక్సిన్ కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించిన ప్రస్తుత పరిస్థితిలో ఎన్టీఏజీఐ ఈ సూచనలు చేయడం గమనార్హం. మరోవైపు, వ్యాక్సినేషన్కు వచ్చే వాళ్లకు ముందుగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయాలన్న ప్రతిపాదనను ప్యానెల్ తోసిపుచ్చింది.